హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న సమ్మిళిత, సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయేలా అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరిస్తూ పురోగమిస్తున్నది’ అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ శాసనభలో చేసిన ప్రసంగంతో సభ హర్షధ్వానాలతో మారుమోగింది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ప్రతీ రంగంలో దేశానికి ఎలా ఆదర్శంగా నిలిచిందో ఆమె ఆధారాలతోసహా తన ప్రసంగంలో ఆవిష్కరించారు. 47 అంశాలపై ఆమె ప్రసంగం సాగింది. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, పరిశ్రమలు, ఐటీ, ఉద్యోగ కల్పన, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇలా అనేక అంశాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని కళ్లకు కట్టారు. అరగంటపాటు ఆమె ఇంగ్లిష్లో ప్రసంగించారు. ఆయా రంగాల్లో గవర్నర్ ప్రస్తావించిన అన్ని అంశాలపై సభ్యులు హర్షామోదాన్ని తెలిపారు.
గవర్నర్ ప్రసంగాన్ని మంత్రులు, శాసనమండలి, శాసన సభ సభ్యులు ఆసక్తిగా విన్నారు. ప్రసంగ ప్రతులను చూస్తూ ఆయా అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలను అండర్లైన్ చేసుకొన్నారు.
రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్గా పనిచేసిన సిరికొండ మధుసూదనాచారి తాజాగా సభలో సభ్యుడిగా ఆశీనులయ్యారు. మధుసూదనాచారి ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతరం శాసనమండలి, శాసనసభ సంయుక్త సమావేశం నిర్వహించటం తొలిసారి కావడంతో ఆయన శాసనసభలో ఆశీనులయ్యారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండో టర్మ్లో తొలిసారి సమావేశాలకు హాజరయ్యారు.
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తరువాత జరిగిన తొలి సమావేశాలు కావడంతో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కండువాలతో మెరిసిపోయారు. సభ్యులు సభలోపలికి వెళ్తున్న సమయంలోనే బీఆర్ఎస్ ఎల్పీ సిబ్బంది సభ్యులందరికీ నూతన గులాబీ కండువాలను అందజేశారు.