Telangana | హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ఆకుపచ్చ కిరీటంతో దేశం ముందు తెలంగాణ మరోసారి ఠీవిగా నిలిచింది. హరితహారంతో అద్భుతాలు ఎలా చేయొచ్చో దేశానికి ప్రత్యక్షంగా చూపింది. అనతికాలంలోనే ‘హరిత’ ఫలాలను కండ్లకు కట్టింది. పర్యావరణ పరిరక్షణకు పుట్టినిల్లుగా మారింది. అడవులు తరగడమే తప్ప పెరగడం తెలియని దేశంలో.. గ్రీన్ కవర్ను పెంచుకొని సగర్వ పతాక ఎగురవేసింది. ఇప్పటికే అనేక అంశాల్లో దేశానికి రోల్మాడల్గా నిలిచిన తెలంగాణ.. దశాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్న వేళ పచ్చదనం పెంపులోనూ తన సత్తా చాటింది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రముఖ సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) నివేదికలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది.
పర్యావరణ పరిరక్షణకు సంబంధించి అడవుల విస్తీర్ణం, పచ్చదనం పెరుగుదల, మున్సిపల్ ఘనవ్యర్థాలు, మురుగునీటి శుద్ధి, పునరుత్పాదక శక్తి, భూగర్భ జలాలు, నీటి వనరులు అనే ఏడు అంశాలను సీఎస్ఈ పరిగణలోకి తీసుకొన్నది. దేశంలోని 28 రాష్ర్టాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరిస్థితులను అధ్యయనం చేసింది. అన్నింటికీ కలిపి ఓవరాల్గా 10 పాయింట్లు నిర్ణయించి, అందులో రాష్ర్టాలకు పాయింట్లు కేటాయించింది. అందులో 7.213 పాయింట్లతో తెలంగాణ దేశంలోనే టాప్గా నిలిచింది. దేశంలోని మిగిలిన రాష్ర్టాలు కనీసం తెలంగాణ దరిదాపుల్లో కూడా లేవు. 26 రాష్ర్టాలు 5.7 పాయింట్లకు దిగువనే ఉన్నాయి. అందులో 16 రాష్ర్టాలు 5 పాయింట్లకే పరిమితం అయ్యాయి. డబుల్ ఇంజిన్ సర్కారు ఉత్తరప్రదేశ్ 4.7 పాయింట్లతో 16వ స్థానంతో సరిపెట్టుకొన్నది.
తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్న వేళ మరో అరుదైన ఘనత దకిందని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురసరించుకొని ప్రముఖ సంస్థ సీఎస్ఈ విడుదల చేసిన నివేదికలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు. తెలంగాణ సర్కారు చేపట్టిన అడవుల పెంపకం, మున్సిపల్ వేస్ట్ మేనేజ్మెంట్వంటి అనేక పర్యావరణహిత కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకొన్న సంస్థ..తెలంగాణ రాష్ట్రానికి అగ్రస్థానాన్ని కట్టబెట్టిందని తెలిపారు. జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పర్యావరణ రంగంలో గొప్ప గుర్తింపు లభించడంపై హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో పరిఢవిల్లాలన్న బృహత్ సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రారంభించిన మానస పుత్రిక హరితహారంతోపాటు అనేక పర్యావరణహితమైన కార్యక్రమాలకు ఈ అరుదైన ఘనత దకడం తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు. హరితహారంతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా అందులో భాగస్వాములైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల ఫలితమే పర్యావరణంలోనూ తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచేందుకు కారణమని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పర్యావరణ విధ్వంసం నుంచి తెలంగాణ ప్రాంతం కోలుకొనేలా తొలినాళ్లలోనే కేసీఆర్ దీర్ఘదృష్టితో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు. ఆ కార్యక్రమం అమలుకు కేసీఆర్ చూపిన కృషి వల్లే ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాల కోసం హరించుకుపోయిన అడవులను పునరుద్ధరించి, రాష్ట్రంలో పచ్చదనాన్ని 22 శాతం నుంచి 33 శాతానికి పెంచడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, ప్రజల సహకారంతో ఇది ఒక ఉద్యమ రూపంలో కొనసాగిందని తెలిపారు. ఇప్పటికే ఈ కార్యక్రమంతో అనేక సానుకూల ఫలితాలు అందుతున్న విషయాన్ని అనేక సంస్థలు పలుమార్లు గుర్తించాయని పేర్కొన్నారు.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మానవ ప్రయత్నంగా తెలంగాణ ప్రభుత్వం హరితహారాన్ని చేపట్టిందని, 273 కోట్ల మొకలను నాటామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 2015-16లో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా.. 2023 నాటికి 26,969 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని తెలిపారు. తెలంగాణ విస్తీర్ణంలో అడవులు 24.06 శాతంగా ఉన్నాయని వివరించారు. హరితహారం ఫలితంగా రాష్ట్రంలో 7.70 శాతం పచ్చదనం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేరొన్న విషయాన్ని గుర్తుచేశారు. నూతన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల్లో ‘హరిత బడ్జెట్’ అనే వినూత్నమైన విధానాన్ని ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ఒక నర్సరీతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 15,000 నర్సరీలు, 19,400కు పైగా పల్లె ప్రకృతి వనాలు, 2,725 బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టణాల్లో రూ.700 కోట్లతో 180 అర్బన్ ఫారెస్ట్ పారులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. హైదరాబాద్ నగరానికి వరల్డ్ ట్రీ సిటీగా రెండుసార్లు గుర్తింపు లభించిందని వెల్లడించారు.
తెలంగాణ సర్కారు పర్యావరణహితమైన అనేక కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు పలు పురపాలికల్లో పేరుకుపోయిన చెత్తను బయో మైనింగ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. హైదరాబాద్లో వేస్ట్ టు ఎనర్జీ రంగంలో 24 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ దేశంలో రెండోస్ధానంలో నిలిచిందని తెలిపారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా విద్యుదుత్పత్తి చేయడంలోనూ అగ్రగామిగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు సోలార్ పవర్ కేవలం 74 మెగావాట్లు మాత్రమేనని, తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధితో ప్రస్తుతం రాష్ట్రంలో 5,865 మెగావాట్లు జరుగుతున్నదని చెప్పారు. సోలార్ ఉత్పత్తిలో చిన్న రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో నిలువడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు, అవార్డులు, ప్రశంసలు రావడం తమకు మరింత స్ఫూర్తిని ఇస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. బృహత్ ప్రకృతి వనాలు దేశానికే ఆదర్శం అంటూ నీతి అయోగ్ ప్రత్యేక ప్రశంసలు ఇచ్చిందని గుర్తుచేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వ సమగ్ర, సమతుల్య పర్యావరణ విధానాలు, పర్యావరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్ధతకు దక్కుతున్న గుర్తింపు అని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు పర్యావరణహిత రాష్ట్రాన్ని అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ సర్కారు పనిచేస్తున్నదని చెప్పారు. ఇదే స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండడం ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్ధతకు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పనితీరుకు నిదర్శనమని రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్కుమార్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ది వందేండ్ల ముందు చూపని, హరితహారం కార్యక్రమం ప్రపంచమంతా అనుసరించాల్సిన కార్యక్రమమని చెప్పారు. అడవుల విస్తీర్ణం, పచ్చదనం పెరుగుదల, మున్సిపల్ ఘన వ్యర్థాలు, మురుగునీటి శుద్ధి, పునరుత్పాదక శక్తి, భూగర్భ జలాలు, నీటి వనరులు ఇలా అన్నింటిలోనూ దేశానికి తెలంగాణ ఆదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): సీఎస్ఈ నివేదికలో దేశంలోనే పచ్చదనం పెంపులో తెలంగాణ అగ్రస్థానంలో నిలువడం సీఎం గ్రీన్ విజన్కు నిదర్శనమని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. ఇది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణకు దకిన బహుమతి అని పేర్కొన్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాలన్నింటినీ వెనకు నెట్టి పది పాయింట్లలో తెలంగాణ 7.21 పాయింట్లు సాధించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. తెలంగాణకు హరితహారం ద్వారా తొమ్మిదేండ్లుగా రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు ఓ వైపు కృషి చేస్తూనే.. మరోవైపు అటవీ పునరుద్ధరణ ద్వారా పెద్ద ఎత్తున అడవుల్లో కూడా పచ్చదనం పెంచిన విధానానికి సీఎస్ఈ నివేదిక అద్దం పడుతున్నదని తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్న వేళ రాష్ట్ర ప్రజలందరికీ ఇది శుభవార్త అని అన్నారు.