Telangana Secretariat | హైదరాబాద్ : తెలంగాణ నూతన సచివాలయాన్ని ఏప్రిల్ 30న ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. సచివాలయం ప్రారంభోత్సవానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీలోని అన్ని కేటగిరీల నాయకులు హాజరు అవుతారని పేర్కొన్నారు.
హుస్సేన్ సాగర్( Hussain Sagar ) తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని( Ambedkar Statue ) ఏప్రిల్ 14న ఆవిష్కరించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. అదే రోజు ఎన్టీఆర్ స్టేడియం( NTR Stadium )లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. ఈ సభకు అన్ని నియోజకవర్గాల నుంచి దళిత బిడ్డలు తరలివస్తారు. సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో అంబేద్కర్కు ఘన నివాళి ఆర్పిస్తారు. అదే రోజున పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు.
జూన్ 1న అమరవీరుల జ్యోతి( Telangana Martyrs’ Memorial) ప్రారంభోత్సవం ఉంటుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమరవీరుల జ్యోతిని నిర్మిస్తుందన్నారు. రాష్ట్ర సాధన కోసం అమరులైన వారిని స్మరించుకునేందుకు అమర జ్యోతి ఏర్పాటు చేశామన్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘన నివాళులర్పించాలని కేసీఆర్ సూచించారు.