పార్లమెంటు బోనులో భారత ప్రధానమంత్రి
ప్రివిలేజ్ మోషన్కు టీఆర్ఎస్ నోటీసు
హక్కుల ఉల్లంఘన తీర్మానంపై చర్చించాలి
అప్పటివరకూ ఉభయ సభలు బహిష్కరణ
ప్లకార్డులతో టీఆర్ఎస్ ఎంపీల నిరసనలు
ప్రధాని అనుచిత వ్యాఖ్యలపై అభ్యంతరం
జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లిన సభలు
మద్దతిచ్చిన మల్లికార్జునఖర్గే, ఇతర నేతలు
దేశ చరిత్రలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఎదుర్కొన్న రెండో ప్రధాని బహుశా మోదీనే. రెండు సార్లు హక్కుల నోటీసు ఎదుర్కొన్న మొదటి ప్రధాని మోదీయే..
భారతదేశ ప్రధానమంత్రే బోనులో నిలబడ్డారు. తెలంగాణ అవతరణను కించపరుస్తూ మాట్లాడినందుకు నరేంద్ర మోదీపై టీఆర్ఎస్ ఎంపీలు గురువారం సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. అటు రాజ్యసభలో, ఇటు లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఏకంగా ప్రధాన మంత్రిపైనే అసమ్మతి, అసంతృప్తి వ్యక్తం చేశారు.
తను పరిపాలిస్తున్న దేశంలోని ఒక రాష్ర్టాన్ని, ఆ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని, అస్తిత్వ ఆకాంక్షను ప్రధానమంత్రే హేళనపరిచిన తీరు కనీ వినీ ఎరుగనిది. తెలంగాణ ఆవిర్భావాన్ని పదేపదే తప్పుబడుతూ మోదీ ప్రాంతీయ మనోభావాలను దెబ్బతీశారు. రాజ్యాంగబద్ధమైన పార్లమెంటు, రాజ్యాంగ విహితంగా ఆమోదించిన చట్టాన్ని, ఏర్పాటు చేసిన రాష్ర్టాన్ని అదే పార్లమెంటు వేదికపై నిలిచి తప్పుబట్టిన మొట్టమొదటి భారత ప్రధానిగా మోదీ అపఖ్యాతి మూటగట్టుకున్నారు. తద్వారా పార్లమెంటు ఔన్నత్యాన్ని తక్కువ చేయడమే కాదు; రాజ్యాంగం నిర్దేశించిన నైతిక, చట్టబద్ధ విలువలను మోదీ తుంగలో తొక్కారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 10 : తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంటు చేసి న చట్టాన్ని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీపై టీఆర్ఎస్ ఎంపీలు గురువారం ఉభయసభల్లో హక్కుల ఉల్లంఘన నోటీసు (ప్రివిలేజ్ మోషన్) ఇచ్చారు. తామిచ్చిన నోటీసులపై నిర్ణయం తీసుకొనేదాకా ఉభయసభల నుంచి వాకౌట్ చేస్తామని ప్రకటించారు. భారత పార్లమెంటు స్ఫూర్తిని, చట్టాలను ప్రధాని ఉల్లంఘించారని ఆరోపించారు. ఉభయసభలను స్తంభింపజేశారు. ప్లకార్డులు పట్టుకొని వెల్లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. ఉభయసభలు జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లాయి.
చర్చించేదాకా వదిలేది లేదు
రాష్ట్ర విభజన జరిగిన తీరుపై ఈ నెల 8న రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందేనని టీఆర్ఎస్ ఎంపీలు పట్టుబట్టారు. గురువారం రాజ్యసభ సమావేశాల ప్రారంభానికి ముందు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు నేతృత్వంలోని ఎంపీలు సంతోష్కుమార్, లింగయ్యయాదవ్, సురేశ్రెడ్డి.. రాజ్యసభ సెక్రటరీ జనరల్కు విశేషాధికార తీర్మానం (ప్రివిలేజ్ మోషన్) నోటీసు అందజేశారు. సభ ప్రారంభం కాగానే కేశవరావు తన స్థానంలో నిలబడి, తామిచ్చిన నోటీసుపై చర్చకు పట్టుబట్టారు. అదే సమయంలో పార్టీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని వెల్లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తంచేశారు. తమ నోటీసుపై వెం టనే నిర్ణయం తీసుకోవాలని కేశవరావు.. డిప్యూ టీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ను కోరారు. టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన తీర్మానానికి రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, పలు పార్టీల ఎంపీలు మద్దతు తెలిపారు. ప్రివిలేజ్ మోషన్ తమకు అందిందని, దీనిపై చైర్మన్ నిర్ణయం తీసుకొంటారని డిప్యూటీ చైర్మన్ పేర్కొన్నారు. ఎంపీలు ఇచ్చిన నోటీసును చైర్మన్ పరిశీలనకు పంపినట్టు చెప్పారు. దీనిపై కేశవరావు తీవ్రంగా స్పందిస్తూ.. చైర్మన్ నిర్ణయం తీసుకొనేదాకా తాము సభకు రాబోమని చెప్తూ వాకౌట్చేశారు.
లోక్సభలోనూ సేమ్ సీన్
లోక్సభ సమావేశాల ప్రారంభానికి ముందు టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు నేతృత్వంలో.. ఎంపీలు బీబీ పాటిల్, పీ రాములు, రంజిత్రెడ్డి, వెంకటేశ్ నేత.. స్పీకర్కు ప్రధానిపై హక్కుల ఉల్లంఘన నోటీసులను అందజేశారు. సభ ప్రారంభం కాగానే టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని వెల్లోకి దూసుకెళ్లారు. షేమ్ ఫుల్.. షేమ్ ఫుల్.. మోదీ వ్యాఖ్యలు సిగ్గుచేటు.. అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర విభజన జరిగి 8 ఏండ్ల తర్వాత.. మోదీ ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ ప్రజలను, దేశ సార్వభౌమత్వానికి ప్రతీక అయిన పార్లమెంటరీ వ్యవస్థను, రాజ్యాంగాన్ని తీవ్రంగా అవమానించడం దారుణమన్నారు. తామిచ్చిన నోటీసుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను డిమాండ్ చేశారు. నిర్ణయం తీసుకొనేంతవరకు తాము సభను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.