మహేశ్వరం ఏప్రిల్ 4: వరి ధాన్యాన్ని కొనేలా కేంద్రం మెడలు వంచుతాం. రాష్ట్ర బీజేపీ నేతలు పూటకో మాట మాట్లాడుతూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. కేంద్రం మన రైతాంగాన్ని కించపరుస్తున్నది. తెలంగాణ ప్రజలను నూకలను తినుమనడం కేంద్రమంత్రి అనాలోచిత విధానాలకు నిదర్శనం. పంజాబ్లో ఎలాగైతే కొంటున్నారో అదే తరహాలో తెలంగాణ ధాన్యాన్నీ కొనాలి. సీఎం కేసీఆర్ రైతు కష్టాలను స్వయంగా చవిచూసిన పెద్ద రైతన్న. కేసీఆర్ పోరాటానికి ప్రతి ఒక్క రైతు బాసటగా నిలువాలి.
– సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
ఖిల్లాఘణపురం, ఏప్రిల్ 4: దేశంలో రైతులను ఇబ్బందులు పెడుతూ ఎంతోమంది ప్రాణాలను తీసుకొన్నది బీజేపీ ప్రభుత్వం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కర్షకులు, కార్మికులను ఇబ్బందులు పెట్టి కొందరికి కొమ్ముకాస్తూ ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేట్పరం చేస్తున్నది. కేంద్రం రైతులపై అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని విడనాడాలి. రైతులు ఎంతో కష్టపడి ధాన్యాన్ని పండిస్తే వరిని కొనకపోవడం ఎంతవరకు సమంజసం? వ్యవసాయంపై అవగాహన లేని పీయూష్ గోయల్ కేంద్ర ఆహార మంత్రిగా ఉండటం దురదృష్టకరం. గ్రామ గ్రామాన పర్యటించి బీజేపీ బండారాన్ని బయటపెడతాం. కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన బుడ్డర్ఖాన్ కేసీఆర్ను విమర్శించడం సరికాదు.
– వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
కరీంనగర్ రూరల్: ఏప్రిల్ 4: రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదే. ధాన్యాన్ని కొనుగోలు అనేది రాజ్యాంగం కల్పించిన విధి. మేమేం బిచ్చం అడుక్కోవడం లేదు. 1965 నుంచి ఎఫ్సీఐ వానకాలంలో రా రైస్, యాసంగిలో బాయిల్డ్ రైస్ కొంటున్నది. ఈ సంవత్సరం కొత్త నిబంధనలతో కేంద్రం తెలంగాణ రైతులపై వివక్ష చూపుతున్నది. ఎప్పటిలాగే యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలి. కేంద్రం వద్దనే వ్యవసాయ చట్టాలు ఉన్నాయి. ఎమ్మెస్పీ బాధ్యత కూడా కేంద్రానిదే. కేంద్రం దిగివచ్చేవరకు ఆందోళనలు కొనసాగిస్తాం. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఈ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదు? కేంద్ర ప్రభుత్వానికి చెప్పి వడ్లు కొనుగోలు చేయించాలి. లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తాం.
-పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్
వేల్పూర్, ఏప్రిల్ 4: రాష్ట్రంపై బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. రైతులను రెచ్చగొట్టి వరి వేయించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఇప్పుడెక్కడున్నారు? కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పచ్చబడితే వాళ్లు ఓర్వలేకపోతున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీవి అన్నీ అబద్ధాలే. రెండేండ్లుగా కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనేందుకు ఆటంకాలు సృష్టిస్తున్నది. రాష్ట్రంలోని ధాన్యాన్ని కొనాలని కేంద్రమంత్రి గోయల్ను మంత్రుల బృందం కలిస్తే కొనేదిలేదని తెగేసి చెప్పారు. పైగా తెలంగాణ ప్రజలు నూకలు తినాలని అవమానించారు. మమ్మల్ని అంటే పడతాం. తెలంగాణ సమాజాన్ని అంటే అస్సలు ఊరుకునేది లేదు. ఇక్కడి బీజేపీ నాయకులు సిగ్గు లేకుండా ఢిల్లీ బీజేపీ సంకలో చేరి వారి మాటలకు వత్తాసు పలుకుతున్నారు. -రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
మహబూబ్నగర్, ఏప్రిల్ 4: తెలంగాణ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వడ్లు కొనాలని కేంద్రం దగ్గరకు వెళ్తే.. మీ ప్రజలకు నూకలు తినిపించండని హేళన చేశారు. మేం కేంద్రానికే నూకలు తినిపిస్తాం. ‘ఒకే పన్ను..ఒకే దేశం’ పేరుతో జీఎస్టీని తీసుకొచ్చిన కేంద్రం.. ఒకే దేశంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఎందుకు వివక్ష చూపుతున్నది? తెలంగాణ సమాజానికి అన్యాయం జరిగితే సీఎం కేసీఆర్ ఊరుకోబోరు. ఎంత దూరమైనా వెళ్తారు. తక్కువ సమయంలోనే వరి అత్యధికంగా సాగు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నంబర్వన్ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ చెరువుల్లో చేప పిల్లలను విడిచేందుకుగానూ రూ.2 వేల కోట్లు కేటాయిస్తే, తెలంగాణ ప్రభుత్వం రూ.5 వేల కోట్లు కేటాయించింది. తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు చేపలు సరఫరాచేసే స్థాయికి చేరుకొన్నాం. – ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
సూర్యాపేట, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): పండిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఆహార భద్రత చట్టం కూడా అదే చెప్తున్నది. వడ్లు కొనకపోతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి కొనిపిస్తాం. కేంద్రం గోల్మాల్ను గమనించాకే.. యాసంగిలో వరి వేయొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ వారించారు. అందుకు భిన్నంగా వరినే వేయాలని ప్రోత్సహించింది ఇక్కడి బీజేపీ నేతలు కాదా? బాధ్యత లేకుండా కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో రైతాంగం గందరగోళంలో పడుతున్నది. దాగుడు మూతలతో రైతాంగాన్ని దగా చేయాలని చూస్తే టీఆర్ఎస్ ఊరుకోదు. రైతులు ఆగ్రహిస్తే.. పండించిన పంటను బండి సంజయ్ నెత్తిన పోస్తారు. – విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
ఖమ్మం, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రం వడ్లు కొనేదాక కొట్లాట ఆగదు. గత ఏడాది వరకు రైతులు పండించిన ధాన్యాన్ని సొసైటీలు, డీసీసీబీలు, డీసీఎంఎస్లు కొని ఎఫ్సీఐకి అప్పగించేవి. ఈ ఏడాది కేంద్రం ధాన్యం కొనుగోలుపై మొండివైఖరి అవలంబిస్తున్నది. తెలంగాణపై వివక్ష చూపుతున్నది. ఆహార భద్రత చట్టాన్ని హేళన చేస్తున్నది. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం దొంగాట ఆడుతున్నది. బీజేపీ నేతలు ఢిల్లీలో ఒక మాట.. గల్లీలో మరో మాట మాట్లాడుతున్నారు. గతంలో బాయిల్డ్ రైస్ తీసుకొని ఇప్పుడు వద్దనడం సరికాదు. కేంద్రం బీజేపీ పాలిత రాష్ర్టాలకు ఒక న్యాయం తెలంగాణకు ఒక న్యాయం పాటిస్తున్నది. దేశంలో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. –రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
దేవరుప్పుల, ఏప్రిల్ 4: ధాన్యం కొనేదాకా పంజాబ్ తరహాలో ఉద్యమిస్తాం. రైతు వ్యతిరేక చట్టాలపై ఆందోళనచేసిన అక్కడి రైతులపై కేంద్రం ఉక్కుపాదం మోపినా, చివరకు క్షమాపణలు చెప్పి, చట్టాలను ఉపసంహరించుకొన్నది. ఇప్పుడు తెలంగాణ రైతుల విషయంలోనూ అదే పునరావృతమవుతుంది. కేంద్రం బేషరతుగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. అప్పటివరకు రైతుల ఆందోళనలు కొనసాగుతాయి. వారికి టీఆర్ఎస్ మద్దతు ఉంటుంది. కేంద్రం రైతు హక్కులకు భంగం కలిగిస్తున్నది. ఓ వైపు కేంద్ర వైఖరిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం.. యాసంగి వరి ధాన్యం తగ్గించాలని రైతులకు అవగాహన కల్పించగా, మరోవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ అర్వింద్ వారిని తప్పుదోవ పట్టించారు. తీరా కేంద్రం చేతులెత్తేయడంతో రైతులు ఆగమయ్యే పరిస్థితి వచ్చింది.
– పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు