న్యూఢిల్లీ : తెలంగాణ రైతులను పట్టించుకోని కేంద్రంపై తెలంగాణ మంత్రులు, ఎంపీలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే.. ఆ బియ్యాన్ని ఢిల్లీకి తీసుకొచ్చి ఇండియా గేటు ముందు పారబోస్తామని మంత్రులు హెచ్చరించారు.
ఢిల్లీలో తెలంగాణ మంత్రులు ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఉపన్యాసాలు ఇవ్వడమే కాదు.. హృదయం కూడా విశాలంగా ఉండాలి. రైతులు మనోవేదనకు గురవుతున్నారు. పండించిన పంటను కొనుగోలు చేయాలని కోరుతూ.. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ నడివీధుల్లో మీ కోసం ఎదరుచూస్తుంటే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. రెండు, మూడు రోజుల తర్వాత పరిణామాలను పరిశీలించి, రాష్ట్రంలో ప్రజలు, రైతుల ఫీడ్బ్యాక్ తీసుకుని ఏం చేయాలో అది చేస్తామన్నారు.
రాష్ట్ర రైతులను తీవ్రంగా అవమానించే విధంగా కేంద్రం వ్యవహరిస్తోంది. పండించిన పంటను కొనకపోతే ఎలా అని ప్రశ్నించారు. ధాన్యం సేకరణపై లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని అడిగితే.. ఇవాళ, రేపు అని సాగదీస్తున్నారు. ఇప్పటికే ఆరు రోజులు అయింది. కేంద్రం నాటకామాడుతున్నట్టు అనిపిస్తున్నది. తెలంగాణ నుంచి తామే ధాన్యం తీసుకోస్తాం.. ఆ ధాన్యాన్ని తీసుకోకపోతే ఇండియా గేటు ముందు పారబోస్తాం. లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఇప్పటి వరకు కేంద్రం నుంచి స్పందన లేదు. తెలంగాణ బియ్యం తీసుకునే ఉద్దేశం కేంద్రానికి లేదన్నారు. గోదాముల్లో ఉన్న బియ్యం తరలించకుండా రాష్ట్రంపై నెపం మోపడం సరికాదన్నారు. వడ్ల సేకరణ టార్గెట్ను పెంచాలి. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలమంతా 9 రోజులు పోరాడాం. కానీ స్పందన లేదా? ఒకట్రెండు రోజుల్లో సమస్య పరిష్కరించాలని మంత్రులు, ఎంపీలు డిమాండ్ చేశారు.