కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నేతలు ఏం చెప్పి ఓట్లడుగుతారని మంత్రి హరీష్రావు ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వనందుకు, పెట్రోల్, డిజీల్, గ్యాస్ ధరలు భారీగా పెంచినందుకు ప్రజలను ఓట్లు వేయమని అడుగుతారా.. అని ఆయన ఎద్దేవా చేశారు. ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు మంత్రి హరీష్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
జమ్మికుంట మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన యువ చైతన్య సంఘం యువత.. ఇల్లందకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన వాల్మికీ బోయ సంఘం నేతలు, కార్యకర్తలు.. జమ్మికుంట మండలం నాగం గ్రామానికి చెందిన నాయకులను సింగాపూర్లో మంత్రి హరీష్ రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. కేంద్ర సర్కారు డీజిల్ ధరలను రూ.60 నుంచి రూ.106కు పెంచిందని విమర్శించారు. దాంతో రైతు వ్యవసాయ పనులకు చెల్లించాల్సిన ట్రాక్టర్ కిరాయి పెరిగిపోయిందన్నారు.
తమ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద పంటకు ఎకరానికి రూ.5,000 చొప్పున ఇస్తుంటే.. కేంద్రం డీజిల్ ధరల రూపంలో భారం మోపి ఎకరానికి రూ.2,500 చొప్పున లాక్కుంటోందని హరీష్రావు విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న కేంద్రం పలువురి ఉద్యోగాలు ఊడగొడుతున్నదని ఆరోపించారు. బీసీ సంక్షేమశాఖ పెట్టమని కోరితే పట్టించుకోని కేంద్రం.. ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మేందుకు డిజిన్వెస్ట్మెంట్ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ లాంటి సంస్థలు నష్టాల్లో ఉన్నా మూడు వేల కోట్ల రూపాయలిచ్చి ఉద్యోగులను కాపాడుకుంటున్నదని చెప్పారు. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఇప్పటికే లక్షా 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలో మరో 50 నుంచి 60 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గెలిస్తే ఆయన మాత్రమే లాభపడుతారని, నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతుందని మంత్రి పేర్కొన్నారు. వ్యక్తి ప్రయోజనమా, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రయోజనమా అనే విషయంలో చర్చపెట్టాలని అన్నారు.
హుజూరాబాద్లో ఓట్లు అడిగే ముందు కళ్యాణ లక్ష్మి, రైతు బంధుపై బీజేపీ వైఖరి ప్రకటించాలని మంత్రి హరీష్రావు డిమాండ్ చేశారు. రైతుబంధు, దండగ అనే బీజేపీ నేత ఈటల కావాలా, రైతుల మేలు కోరే తెరాస కావాలా అన్న దానిపై కూడా చర్చ పెట్టాలని వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్ గడియారాలు, కుట్టు మిషన్లు, గొడుగులు, కుక్కర్లను పంచుతూ హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. బీజేపీ కుతంత్రాలను ఎదిరిస్తూ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని కార్యకర్తలకు మంత్రి పిలుపునిచ్చారు.