Minister Errabelli Dayakar Rao | తొర్రూరు/దేవరుప్పుల : తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయని హామీలను ఇక్కడ ఇస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అక్కడ లేనిది ఇక్కడ ఇస్తామంటే నమ్మాలా? అని ప్రశ్నించారు. ఆ పార్టీని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని అన్నారు. కాంగ్రెస్ వస్తే ఇచ్చేది లేదు.. వచ్చేది లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ ప్రజల స్వయంపాలన ఉండదు. కాంగ్రెస్ నాయకత్వం తాళాలు ఢిల్లీలో ఉంటాయి. వాళ్లంతా ఢిల్లీకి గులాములని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. తండాబాటలో భాగంగా శనివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఆయన పర్యటించారు. అలాగే జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చేరిక కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయా తండాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గుడిబండ తండా, భోజ్యా తండా, పెద్ద మంగ్యా తండా, భీక్యా తండా, కొమ్మనపల్లి తండా, సోమారపుకుంట తండా తండాల్లో మంత్రి బైక్పై, ఎడ్లబండిపై కలియదిరిగారు. వేర్వేరుగా నిర్వహించిన సమావేశాల్లో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ఎస్టీలలో వర్గీకరణ చిచ్చుకు కుట్ర పన్నుతున్న కాంగ్రెస్ను తిప్పికొట్టాలన్నారు. తండాలకు వచ్చే ఆ పార్టీ నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
గిరిజనుల ఏండ్ల గోసను ఎడబాపింది కేసీఆరేనని, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత ఆయనదే అన్నారు. గ్రామాలకు దీటుగా గిరిజన తండాలను అభివృద్ధి చేసిన చరిత బీఅర్ఎస్దని చెప్పారు. కేసీఆర్కు మోసం చేస్తే సేవాలాల్కు మోసం చేసినట్లే అని గిరిజనులకు విజ్ఞప్తి చేశారు. ఒకో గ్రామానికి కోటి రూపాయలతో అనేక అభివృద్ధి పనులతో సంక్షేమ కార్యక్రమాలతో గతంలో కనీవినీ ఎరగని రీతిలో తండాలను సైతం గ్రామాలకు ధీటుగా అభివృద్ధి చేసిన ఘనత చరిత సీఎం కేసీఆర్కే దకుతుందన్నారు. రైతుల నడ్డి విరవడానికి 3 గంటల కరెంటు చాలంటోందని గుర్తు చేశారు. 3 గంటల కరెంటు కావాలా? 3 పంటల బీఆర్ఎస్ కావాలా ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. ప్రజలను విభజించి పాలించే కుట్రలు పన్నుతున్న కాంగ్రెస్ నేతలను మన నియోజకవర్గంలో కాలు పెట్టనివ్వవద్దు తరిమికొట్టాలన్నారు. మన కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు, తనకు అండగా నిలవాలని మంత్రి ప్రజలను కోరారు.
‘మా తండాల్లో మా రాజ్యం’ అన్న గిరిజనుల కోసం 3,146 తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చి వారి తండాల్లో, గూడేల్లో వారి పాలనను కొనసాగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు. గ్రామాలకు దీటుగా తండాలను తాను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడమేగాక ఒకో తండాకు కోటి రూపాయలతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్లు వివరించారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్కి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని గిరిజనులకు చెప్పారు.
ఈ సందర్భంగా తొర్రూరు మండలం చీకటాయపాలెం, పెద్దమంగ్యా తండాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, పెద్దవంగర మండలం వడ్డెకొతపల్లి పరిధిలోని బొత్తలతండాకు చెందిన 20మంది బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి మంత్రి కండువాలు కప్పి ఆహ్వానించారు. అలాగే జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెదమడూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బబ్బూరి శ్రీకాంత్గౌడ్ నేతృత్వంలో గ్రామంలోని వివిధ పార్టీల నుంచి 20మంది ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.