హైదరాబాద్, జూలై 14 (నమస్తేతెలంగాణ): వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన రికార్డు స్థాయి ధాన్యంలో దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం స్టోరేజీ స్పేస్ లేకపోవడంతో ఆరు బయట తడిసి ముద్దవుతున్నదని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ధాన్యం మరో పది రోజుల్లో పూర్తిగా పాడైపోయే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వాటిని టెండర్ ద్వారా విక్రయించే ప్రతిపాదనలను సీఎం కేసీఆర్కు సమర్పించే అంశంపై గురువారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో మంత్రి గంగుల సివిల్ సైప్లె ఉన్నతాధికారులు, మిల్లర్ల సంఘం ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
గత నెల 7 నుంచి కుంటిసాకులతో ఎఫ్సీఐ రాష్ట్రం నుంచి సీఎంఆర్ ప్రక్రియను నిలిపివేసింది. రాష్ట్రం వద్ద 2020-21 యాసంగి, 2021-22 వానకాలం ధాన్యం కలిపి 94 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం నిల్వ ఉన్నది. సీఎంఆర్ ప్రక్రియను పునఃప్రారంభించాలని ఎఫ్సీఐ అధికారులకు, కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం, సివిల్సైప్లె శాఖ పదే పదే విజ్ఞప్తిచేస్తున్నది. అయినా, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల వర్షాలతో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మరో వారం పదిరోజుల్లో పాడై పోయే పరిస్థితులు నెలకొన్నది. ఈ ధాన్యాన్ని ఈ టెండర్ ద్వారా విక్రయించే ప్రతిపాదనలపై తక్షణమే సీఎంకేసీఆర్కు నివేదిక సమర్పించాలని మంత్రి గంగుల నిర్ణయించారు. టెండర్ల విధివిధానాలు, ఎఫ్సీఐ వైఖరి, రాష్ట్ర పీడీఎస్ అవసరాలపై మంత్రి గంగుల సుదీర్ఘంగా చర్చించారు. తక్కువ నష్టంతో ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలన్న దానిపై ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సమావేశంలో పౌరసరఫరాలశాఖ డిప్యూటీ కమిషనర్ రుక్మిణి, సవిల్ సప్లయిస్ కార్పొరేషన్ జీఎం రాజారెడ్డి, మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గంపా నాగేందర్, ప్రధాన కార్యదర్శి మోహన్రెడ్డి పాల్గొన్నారు.