మూడు రోజులు కాలినడకన
మేడారం చేరికతో జాతర ప్రారంభం
గుండాల, ఫిబ్రవరి 14: సమ్మక్క-సారలమ్మల సన్నిధికి సమ్మక్క భర్త పగిడిద్దరాజు బయలుదేరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని యాపలగడ్డ గ్రామానికి చెందిన అరెం వంశీయులు ఏటా పగిడిద్ద రాజుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మూడురోజులపాటు 75 కిలోమీటర్ల మేర కాలి నడకన మేడారం తీసుకెళ్తారు. తొలిరోజు యాపలగడ్డ నుంచి పగిడిద్దరాజుతో బయలుదేరిన అరెం వంశీయులు గుండాల, నర్సాపురం, నర్సాపురం తండా, రోళ్ళగడ్డ, దేవలగూడెం, దుబ్బగూడెం, మామిడిగూడెం, లింగాల మీదుగా రాత్రికి కొడిసెల గ్రామం చేరుకొంటారు. రెండో రోజు అంకన్నగూడెం, జగ్గన్నగూడెం మీదుగా నార్లాపూర్ చేరుకొని అక్కడ నిద్ర చేస్తారు. ఈ నెల 16న పగిడిద్దరాజు మేడారం గద్దెల వద్దకు రాత్రి 9 గంటలలోపు చేరుకోవడంతో జాతర మొదలవుతుంది. మరుసటి రోజు సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి గద్దెల వద్దకు తీసుకొస్తారు. ఫిబ్రవరి 17న పగిడిద్దరాజు-సమ్మక్కకు పెండ్లి తంతును వడ్డెలు నిర్వహిస్తారు. నాగవెల్లి జాతర నిర్వహించి వనదేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.