Telangana Martyrs | హైదరాబాద్ : తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం ప్రారంభించిన అనంతరం అదే వేదికపై అమరుల కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సన్మానించారు. ఆరుగుల అమరుల కుటుంబాలకు కేసీఆర్ శాలువా కప్పి సన్మానించారు. దీంతో అమరుల కుటుంబాలు కన్నీటి పర్యంతం అయ్యాయి. ఒకరకమైన ఉద్విగ్న వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగింది. కన్నీటి చుక్కల సాక్షిగా ఈ ఘట్టం నిలిచిపోయింది.
మొదటగా శ్రీకాంతాచారి కుటుంబాన్ని కేసీఆర్ సన్మానించారు. కన్నీటి పర్యంతమైన శంకరమ్మను కేసీఆర్ ఓదార్చారు. శ్రీకాంతాచారి 2009 నవంబర్ 29న పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని, డిసెంబర్ 3న తుదిశ్వాస విడిచాడు. అనంతరం పోలీసు కిష్టయ్య కుటుంబాన్ని సన్మానించారు. కన్నీటి పర్యంతమైన కిష్టయ్య భార్యను కేసీఆర్ ఓదార్చారు. కిష్టయ్య టెలిఫోన్ టవర్ ఎక్కి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని కేసీఆర్ సత్కరించారు. ఎంసీఏ విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి ఓయూ క్యాంపస్లో ఆత్మహత్య చేసుకున్నాడు. సిరిపురం యాదయ్య కుటుంబాన్ని కేసీఆర్ సత్కరించారు. అసెంబ్లీ ముట్టడి పిలుపులో భాగంగా ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద ఆత్మాహుతి చేసుకున్నాడు. అనంతరం యాదిరెడ్డి కుటుంబాన్ని సన్మానించారు. ఢిల్లీలో పార్లమెంట్కు ఎదురుగా చెట్టుకు ఉరేసుకున్నాడు. ఆ తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్కు జిల్లాకు చెందిన కావలి సువర్ణ తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుటుంబ సభ్యులను కూడా కేసీఆర్ సన్మానించారు. అమరుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని చూసుకుంది.