Lok Sabha Elections | హైదరాబాద్ : తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు సహా 525 మంది పోటీలో ఉన్నారు. 2,20,24,806 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
120 హాళ్లలో 1855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 19 హాళ్లలో 276 టేబుల్స్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. చొప్పదండి, దేవరకొండ, యాకుత్పురా అసెంబ్లీ సెగ్మెంట్లలో 13 రౌండ్లలో లెక్కించనున్నారు. ఆర్మూరు, భద్రాచలం, ఆశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో 13 రౌండ్లలో లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపునకు సుమారు 10 వేల మంది సిబ్బంది పని చేయనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు 144 సెక్షన్ విధించనున్నారు. మద్యం దుకాణాలను బంద్ చేయనున్నారు.