కేంద్ర ప్రభుత్వానికి పోటెత్తిన ఏకగ్రీవ తీర్మానాలు
గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీల్లో తీర్మానాలు
గోయల్, ప్రధానికి రిజిస్టర్ పోస్టులు
సూర్యాపేట జడ్పీలో తీర్మానాన్ని బలపరిచిన ఎంపీ ఉత్తమ్కుమార్
నిర్మల్ జిల్లా న్యూలోలంలో పంచాయతీలో గుజరాతీలో తీర్మానం
కథలాపూర్లో చేసిన తీర్మానంలో పాల్గొన్న బీజేపీ మండలాధ్యక్షుడు
హైదరాబాద్, మార్చి 26 : వడ్లు కొనబోమని తెగేసి చెప్తున్న కేంద్రంపై పల్లెలు తిరుగబడుతున్నాయి. కొని తీరాల్సిందేనని తేల్చిచెప్తున్నాయి. పంజాబ్ తరహాలో రాష్ట్రంలో రెండు సీజన్ల వడ్లను కొనాల్సిందేనని కేంద్ర మంత్రి గోయల్ సహా ప్రధాని నరేంద్ర మోదీకి అన్నిస్థాయిల పాలకవర్గాలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి రిజిస్టర్ పోస్టులు పంపుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, మార్కెట్ కమిటీలు, డీసీసీబీలు, డీసీఎంఎస్లు సహా ప్రత్యక్ష, పరోక్ష పద్ధతిలో ఎన్నికైన ప్రజాభాగస్వామ్య ప్రతినిధి సంస్థలన్నీ కేంద్రానికి నివేదిస్తున్నాయి. రాష్ట్ర రైతాంగానికి కేంద్రం చేస్తున్న మోసాన్ని చెప్పటం, వడ్లు కొనబోమన్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగట్టడం, వడ్లు కొనుగోలు చేసేలా ఒత్తిడి పెంచటం.. అప్పటికీ కొనకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగాలని టీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణను ఇప్పటికే ప్రకటించింది. శనివారం రాష్ట్రవాప్తంగా దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో కేంద్రం వడ్లు కొనాలన్న డిమాండ్తో ఏకగ్రీవ తీర్మానాల పరంపర మొదలైంది. కేంద్ర మంత్రి గోయల్కు, ప్రధాని మోదీకి రిజిస్టర్ పోస్టులు, స్పీడ్ పోస్టులు, కొరియర్ ద్వారా ఏకగ్రీవ తీర్మాన కాపీలను పంపిస్తున్నారు. ఏప్రిల్ 1 వరకు అన్నిస్థాయిల ‘స్థానిక’ పాలకవర్గాలన్నీ తీర్మానాలు పూర్తిచేయాలని, ఉగాది తర్వాత ఉద్యమ కార్యాచరణ వెల్లడిస్తామని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలోని దాదాపు 80 శాతం గ్రామ పంచయతీలు సర్పంచ్ల అధ్యక్షతన సమావేశమై ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి.
గోయల్ వ్యాఖ్యలపై భగ్గుమన్న తెలంగాణ
రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయాలని ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రుల బృందంతో కేంద్ర మంత్రి గోయల్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ భగ్గుమన్నది. గోయల్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. నిరసనగా గోయల్ దిష్టిబొమ్మలను దహనంచేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, విప్ గొంగిడి సునీత తదితరులు గోయల్ దిష్టిబొమ్మను దహనంచేశారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం గోయల్పై వినూత్న నిరసన చేపట్టింది. ఆయనకు నూకలను కొరియర్ చేసింది.
ఊరూరా తీర్మానాలు..
యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, కరీంనగర్ జిల్లా పరిషత్తుల సర్వసభ్య సమావేశాలు నిర్వహించి ఏకగ్రీవ తీర్మానం చేశాయి. కరీంనగర్ జడ్పీ తీర్మాన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. సూర్యాపేట జడ్పీ సమావేశంలో మంత్రి జగదీశ్రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి పాల్గొని మద్దతు ప్రకటించారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని నిజామాబాద్ జిల్లా మాక్లూర్లో మండలంలోని 30 గ్రామ పంచాయతీల సర్పంచ్లు ఏకగ్రీవ తీర్మానంచేశారు. తీర్మాన పత్రాలను పోస్టు, కొరియర్ ద్వారా ప్రధాని మోదీకి పంపించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు అన్ని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులు, బల్దియాలు, సహకార సంఘాల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తకారాయిగూడెం, గంగదేవిపాడు, కల్లూరు మండలం కొర్లగూడెం, సత్తుపల్లి మండలం సదాశివునిపాలెం, పాకలగూడెం, బేతుపల్లి, గంగారం గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపారు. జూలూరుపాడు మండలంలోని 24 గ్రామాల్లో పంచాయతీల్లోనూ తీర్మానాలు చేశారు. బోనకల్లు మండల పరిషత్తులోనూ తీర్మానంచేశారు. ములుగు జిల్లా ములుగు మండలం బరిగలానిపల్లి గ్రామ పంచాయతీలో, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మామిండ్ల వీరయ్యపల్లిలో సర్పంచ్ ఆధ్వర్యంలో తీర్మానంచేశారు.
గుజరాతీలో తీర్మానం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,509 గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేశారు. నిర్మల్ జిల్లా దిలావార్పూర్ మండలం న్యూలోలం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వినూత్నంగా పత్రం రాశారు. ప్రధాని నరేంద్ర మోదీకి అర్థమయ్యేలా గుజరాతీ భాషలో చేసినట్టు సర్పంచ్ ఓడ్నం సవిత తెలిపారు.