కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలంటే ప్రధాని మోదీ ఆశీర్వాదం అక్కర్లేదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేటీఆర్ ఉన్నత చదువులు చదివిన గొప్ప విజన్ ఉన్న నాయకుడు అని .. ప్రజల్లో గొప్ప అభిమానాన్ని సంపాదించుకున్న నాయకుడు అని కొనియాడారు. కేటీఆర్ భవిష్యత్తులో తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని.. అందులో ఎవరికీ సందేహం లేదని వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాలకు అంకురార్పణ చేసిందే బీజేపీ పార్టీ అని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ నేతలు కుటుంబ పాలనపై మాట్లాడటం చాలా బాధాకరమని అన్నారు. వెంటిలేటర్పై ఉన్న బీజేపీని కాపాడుకోవడానికే కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులపై ప్రధాని మోదీ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్పై మాట్లాడే అర్హత ప్రధాని మోదీకి అస్సలు లేదన్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.
నిజామాబాద్ సభలో నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చేవిధంగా ఉన్నాయని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రధాని హోదాలో ఉండి.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై, ఆయన కుటుంబసభ్యులపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని అభిప్రాయపడ్డారు. గత తొమ్మిదేండ్లలో రాష్ట్రానికి ఒక్క పైసా ఇవ్వని ప్రధానికి తెలంగాణ గడ్డపై మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. విభజన హామీలను తుంగలో తొక్కిన ఘనుడు మోదీ అని.. పార్లమెంటు లోపల, బయట తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన అవహేళన చేస్తూ మాట్లాడారని గుర్తు చేశారు. అవినీతిపరులు తన పక్కన కూర్చోవడానికి భయపడతారని మోదీ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈడీ, సీబీఐ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బీజేపీ తమ పార్టీలో ఎందుకు చేర్చుకుంటుందని ప్రశ్నించారు. మేం అవినీతి చేస్తే.. మాపై ఎందుకు విచారణ జరిపించలేదని నిలదీశారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే తప్పుడు ఆరోపణలు చేయడం సబబు కాదని హితవు పలికారు. ప్రధాని మోదీ ఒక నియంతలా ఆలోచిస్తున్నారని.. ప్రధాని స్థాయి వ్యక్తి కక్షపూరితంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని అన్నారు.