మా రైతుల ధాన్యం కొనేదాకా వదిలేదే లేదు
పంజాబ్కు ఓ నీతి.. తెలంగాణకు ఓ నీతా?
రైతు రాజుగా ఎదుగుతుంటే కేంద్రం కొర్రీలు
దిగిరాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం
గోయల్కూ కిరణ్కుమార్రెడ్డికి పట్టిన గతే
ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం తీరుపై మండిపడ్డ రాష్ట్ర మంత్రులు
ధాన్యం కొనుగోలులో కేంద్రం పంజాబ్తో ఒకలా, తెలంగాణతో ఒకలా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల వడ్లు ఎందుకు కొనరని కేంద్రాన్ని, ప్రధాని మోదీని నిలదీశారు. ధాన్యం కొనేదాకా కేంద్రాన్ని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు, రైతులు రాజుగా ఎదుగుతుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూసి ఓర్వలేకపోతున్నదని దుయ్యబట్టారు. నూకలు తినుమన్న గోయల్కు ఏపీ సీఎం కిరణ్కుమార్రెడ్డికి పట్టినగతే పడుతుందని మండిపడ్డారు.
అందరు ప్రధానులు కొన్నరు.. మోదీ నువ్వెందుకు కొనవు?
ప్రశ్నించిన మంత్రి హరీశ్రావు
సిద్దిపేట అర్బన్, మార్చి 31: దేశ తొలి ప్రధాని నెహ్రూ మొదలుకొని మన్మోహన్సింగ్ వరకు అందరు ప్రధానులు రైతులు పండించిన ధాన్యాన్ని కొన్నారని, కానీ వడ్లు కొననని చెప్పిన ఏకైక ప్రధాని మోదీయేనని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. గురువారం సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నంగునూరు, చిన్నకోడూరు మండలాల్లో హరీశ్రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం పక్షపాత ధోరణిని వీడాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం మొండివైఖరి సరికాదని అన్నారు. పంజాబ్కు ఓ నీతి, తెలంగాణకు ఓ నీతి అన్నట్టు వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. రైతుల పక్షాన నిలబడి, కలబడుతున్నది ఒక్క సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా ఇలా పథకాలు చేపట్టి రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ నిలిచారని కొనియాడారు. రాష్ట్రంలో ప్రతి అంగుళం భూమి సస్యశ్యామలంగా మారుతున్నదని, రైతులు బంగారు పంటలు పండిస్తున్నారని వెల్లడించారు. సమైక్య రాష్ట్రంలో ఏ కాలం చూసినా ఎండాకాలంలా ఉండేదని, తెలంగాణ రాష్ట్రంలో ఏ కాలం చూసినా వానకాలంలా ఉన్నదని పేర్కొన్నారు.
సంజయ్.. దమ్ముంటే వడ్లు కొనిపించు: ప్రశాంత్రెడ్డి
భీమ్గల్, మార్చి 31: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి దమ్ముంటే ప్రధాని మోదీని ఒప్పించి తెలంగాణ వడ్లను కేంద్రంతో కొనిపించాలని రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యాన్ని కొనకుండా కేంద్రం తెలంగాణ రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నదని విమర్శించారు. కేంద్రం ఇలా దుర్బుద్ధితో మొండికేస్తుందని ముందే ఊహించిన సీఎం కేసీఆర్.. రైతులు ఇబ్బందులు పడవద్దన్న ఉద్దేశంతో వరిసాగు తగ్గించాలని కోరారని గుర్తు చేశారు. కానీ బండి సంజయ్ కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణ వడ్లను కొనిపిస్తానని, రైతులందరూ వరి సాగు చేయాలని రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ మాట్లాడిన ఆడియోను కూడా మంత్రి ఈ సందర్భంగా వినిపించారు. ఇచ్చిన మాట ప్రకారం సంజయ్ కేంద్రంతో వడ్లు కొనిపించాలని, లేదంటే తెలంగాణలో తిరగకూడదని డిమాండ్ చేశారు. రైతులకు నూకలు అలవాటు చేయాలన్న కేంద్ర మంత్రి గోయల్కు ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్కుమార్కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.