ఒకప్పుడు.. డాక్టరీ చదువు డబ్బునోళ్లకే పరిమితం. కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి ఆ అపోహను తొలగించింది. మధ్యతరగతికీ వైద్యవిద్యను చేరువ చేసింది.
ఒకప్పుడు.. ఇక్కడ సీటు రాకుంటే లక్షలు ఖర్చుచేసి, విదేశాల్లో తెలియని భాషతో తిప్పలు పడాలనే ఆందోళన ఉండేది. తెలంగాణ ప్రభుత్వం బీ-క్యాటగిరీ సీట్లలో స్థానిక విద్యార్థులకే అవకాశం దక్కేలా 85శాతం రిజర్వేషన్ను అమలు చేసి భరోసా ఇచ్చింది.
ఒకప్పుడు.. ఎస్టీలు ఎంబీబీఎస్ చేయాలంటే అవకాశాలు పరిమితం. ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్ పెంపుతో వారి విద్యావకాశాలను ప్రభుత్వం రెట్టింపు చేసింది.
అన్నింటికి మించి వైద్యవిద్య కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షలో తక్కువ ర్యాంకు వస్తేనే సీటు వస్తుందన్న వాతావరణం ఉండేది. కానీ కేసీఆర్ సర్కారు చర్యలతో 8,78,280 ర్యాంకు వచ్చిన విద్యార్థికి సైతం ఈ ఏడాది స్వరాష్ట్రంలోనే ఎంబీబీఎస్ సీటు దక్కింది. తద్వారా రాష్ట్ర వైద్యవిద్య చరిత్రలో తెలంగాణ సర్కారు సరికొత్త రికార్డు సృష్టించింది. తలసరి వైద్యవిద్య సీట్లలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది.
ఇది స్వరాష్ట్ర ఫలం. ఇది కేసీఆర్ సంకల్ప బలం.
ఇది సర్కారు దార్శనికత సాధించిన ఫలితం
హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ‘జిల్లాకో మెడికల్ కాలేజీ’ని ఏర్పాటుచేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పం ఇప్పు డు ఫలితాలనిస్తున్నది. కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయానికి ‘బహుళ ప్రయోజనాలు’ ఉంటాయని అందరికీ తెలిసిందే. మెడికల్ కాలేజీల ఏర్పాటులోనూ అది ప్రస్ఫుటంగా కనిపిస్తున్న ది. ఓ వైపు సూపర్ స్పెషాలిటీ సేవలు గ్రా మీణ ప్రజలకు చేరువ కాగా, మరోవైపు తెలంగాణ బిడ్డలకు వైద్యవిద్య అవకాశాలు పెరుగుతున్నాయి. దేశ చరిత్రలో రికార్డుస్థాయిలో ఈ ఏడాది రాష్ట్రంలో ఏకంగా 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించడంతో కొత్తగా 1,150 ఎంబీబీఎస్ సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఏ ఉక్రెయిన్కో, చైనాకో వెళ్లి రూ.లక్షలు ఖర్చుపెట్టి, తెలియని భాషతో, కొత్తప్రాంతంలో బిక్కుబిక్కుమంటూ ఏండ్లకేండ్లు గడిపే దుస్థితి తప్పింది. బీ-క్యాటగిరీలో 85 శాతం లోకల్ రిజర్వేషన్తో ఈసారి ఏకంగా 8.78 లక్షల నీట్ ర్యాంకుకూ ఎంబీబీఎస్ సీటు దక్కింది. అంతేకాదు.. తలసరి ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. తలసరి పీజీ సీట్లలో రెండో స్థానం సంపాదించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించడంతో మొత్తం వైద్యకళాశాలల సంఖ్య 42కు చేరింది. ఎంబీబీఎస్ సీట్లు 6,690కి చేరాయి. దీంతో రాష్ట్రంలో కన్వీనర్ కోటా, ఎన్నారై కోటా సీట్లు పెరిగాయి.
గత ఏడాది: 2021-22లో ఆలిండియా కోటా మినహాయిస్తే కన్వీనర్ కోటాలో (ఏ-క్యాటగిరీలో) 3,038 సీట్లు మాత్రమే ఉండేవి.
ఈ ఏడాది: ఈ ఏడాది కొత్త మెడికల్ కాలేజీలతో 1,150 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆలిండియా కోటాను మినహాయిస్తే ఈ ఏడాది కన్వీనర్ కోటా సీట్ల సంఖ్య 4,094కు పెరిగింది. అంటే.. గత ఏడాది కంటే అదనంగా 35 శాతం సీట్లు పెరిగాయి. ఫలితంగా ఓపెన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ-ఏ, బీసీ-బీ, బీసీ-సీ, బీసీ-డీ, బీసీ-ఈ క్యాటగిరీల్లో కటాఫ్ తగ్గి, ఎకువ మందికి అవకాశాలు దక్కాయి.
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని యాజమాన్య కోటా సీట్లలో (బీ-క్యాటగిరీలో) ఎక్కువగా ఇతర రాష్ర్టాల విద్యార్థులు చేరుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. దాంతో ఇక్కడ అవకాశాలు దొరుకక తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ర్టాల్లో, విదేశాల్లో అధిక ఫీజులు చెల్లించి, దూర ప్రాంతాల్లో చదవాల్సి వస్తున్నదని భావించింది. దీంతో ఈ ఏడాది నుంచి బీ-క్యాటగిరీ సీట్లలో 85 శాతం లోకల్ రిజర్వేషన్ నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 27న ఉత్తర్వులు వెలువరించింది. ఫలితంగా రిజర్వ్ అయిన సీట్లన్నీ ఈ సారి తెలంగాణ విద్యార్థులకే దక్కాయి.
గత ఏడాది : 2021-22లో మైనార్టీ మెడికల్ కాలేజీలనూ కలుపుకొని బీ-క్యాటగిరీలో 1,214 సీట్లు ఉండేవి. రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఇందులో 495 సీట్లు మాత్రమే లోకల్ విద్యార్థులకు దకాయి. గరిష్ఠంగా 2,71,272 ర్యాంకు వచ్చిన తెలంగాణ లోకల్ విద్యార్థికి అడ్మిషన్ దొరికింది. మిగతా 719 సీట్లలో నాన్ లోకల్ కింద ఇతర రాష్ర్టాల విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. అంటే.. దాదాపు 60 శాతం సీట్లు ఇతర రాష్ర్టాల విద్యార్థులకు దక్కాయి.
ఈ ఏడాది : ఈ ఏడాది బీ-క్యాటగిరీలో మొత్తం 1,267 సీట్లు ఉన్నాయి. ఇందులో 85 శాతం లోకల్ రిజర్వేషన్ విధానం వల్ల 1,071 సీట్లు తెలంగాణ విద్యార్థులకు రిజర్వ్ అయ్యాయి. దీంతో ఈ సారి 8,78,280 ర్యాంకు వచ్చిన తెలంగాణ విద్యార్థికి సైతం సీటు వచ్చింది.
ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 30న ఉత్తర్వులు వెలువరించింది. దీంతో మరింత మంది గిరిజన బిడ్డలకు వైద్యవిద్య చదివే అవకాశం లభించింది.
గత ఏడాది: 2020-21లో ఎస్టీ కోటాలో 223 సీట్లు ఉండేవి. గరిష్ఠంగా 1,46,391 ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు వచ్చింది.
ఈ ఏడాది: ఎస్టీ విద్యార్థులకు దక్కిన సీట్ల సంఖ్య 429కి పెరిగింది. ఈ సారి ఏకంగా 2,09,646 ర్యాంకు వచ్చిన విద్యార్థికి సైతం సీటు లభించింది.
ఎంబీబీఎస్ సీట్లు సాధించడంలో యువకుల కన్నా యువతులే పైచేయి సాధిస్తున్నారు.
గత ఏడాది: రాష్ట్రంలో కన్వీనర్, మేనేజ్మెంట్ కోటా కలిపి మొత్తం 5,095 సీట్లు ఉన్నాయి. ఇందులో కన్వీనర్ కోటాలో 63.36 శాతం, మేనేజ్మెంట్ కోటాలో 55.76 శాతం సీట్లలో యువతులు అడ్మిషన్లు పొందారు. అంటే.. సగటున మొత్తం సీట్లలో 60.79 శాతం యువతులే చేరారు. 39.21 శాతం సీట్లు మాత్రమే యువకులకు దక్కాయి.
ఈ ఏడాది: అడ్మిషన్లలో ఈ సారి సైతం యువతులదే పైచేయి అయ్యింది. ఈ ఏడాది రాష్ట్రంలోని సీట్లు మొత్తం 6,186 కాగా, ఇందులో కన్వీనర్ కోటాలో 62.68శాతం, మేనేజ్మెంట్ కోటాలో 63.73శాతం సీట్లలో యువతులే అడ్మిషన్ పొందారు. మొత్తంగా 62.98 శాతం సీట్లు పొందారు. సుమారు 37 శాతం సీట్లు మాత్రమే యువకులకు దక్కాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలతో వైద్యవిద్యలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. తలసరి గణాంకాలను చూస్తే.. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యలో దేశంలోనే మొదటిస్థానంలో, పీజీ సీట్లలో రెండో స్థానంలో రాష్ట్రం నిలిచింది.
రాష్ట్రంలో మొత్తం 6,690 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. జనాభాపరంగా చూసినప్పుడు ప్రతి లక్ష మంది జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నా యి. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్యంతోపాటు, వైద్యవిద్యను మరింత పటిష్ఠం చేసేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, బీ-క్యాటగిరీలో స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్ను 6 నుంచి 10 శాతానికి పెంచడం వంటి విప్లవాత్మకమైన చర్యలు.. డాక్టర్ కావాలనే తెలంగాణ విద్యార్థుల కలను సాకారం చేస్తున్నాయి. చైనా, ఉక్రెయిన్, రష్యా, చైనా, ఫిలిప్పీన్స్ వంటి దూర దేశాలకు వెళ్లి, వ్యయ ప్రయాసలకోర్చి, పరిచయం లేని భాషల్లో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించే కష్టాలు విద్యార్థులకు తప్పుతున్నాయి. మరోవైపు తల్లిదండ్రులకు ఆర్థికభారం నుంచి ఉపశమనం లభిస్తున్నది. ఒకవైపు ఎంబీబీఎస్ విద్యకు రాష్ట్రంలో అవకాశాలు విస్తృతం కాగా, మరోవైపు మారుమూల జిల్లాల్లోనూ వైద్యసేవలు ప్రజలకు చేరువవుతున్నాయి. జనాభా ప్రాతిపదికన ఎంబీబీఎస్, పీజీ సీట్ల విషయంలో మనం దేశంలోనే అగ్రస్థానంలో నిలువడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఆరోగ్య తెలంగాణ లక్ష్యాన్ని మరింత చేరువ చేస్తున్నాయనడానికి ఇవన్నీ నిదర్శనాలు.
– హరీశ్రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి