Aarogyasri | హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ప్రజలకు సొంతంగా ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ భారత్’ కంటే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న‘ఆరోగ్యశ్రీ’ పథకం ద్వారానే ఎక్కువ మంది సేవలు పొందుతున్నట్టు స్వయంగా నరేంద్రమోదీ సర్కారే స్పష్టం చేసింది. రాష్ట్రంలో బీమాకు అర్హత కలిగిన 68% కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ద్వారానే సేవలు అందుతున్నాయని, ఆయుష్మాన్ భారత్ పథకం కేవలం 32% కుటుంబాలకే వర్తిస్తున్నదని వెల్లడించింది. ‘ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్యశ్రీ ఎంతో మెరుగైన పథకం. వ్యాధుల సంఖ్య, కుటుంబాల కవరేజీ విషయంలో ఆరోగ్యశ్రీ వందపాళ్లు నయం’ అని సీఎం కేసీఆర్ ఇప్పటికే అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. ఇది నిజమేనని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే రాజ్యసభలో అంగీకరించింది.
ఆరోగ్య శ్రీతో పోల్చితే ఆయుష్మాన్ భారత్ పరిధి తక్కువగా ఉన్నది. ఆయుష్మాన్ భారత్ కన్నా ముందు తెలంగాణలో సుమారు 90 శాతం కుటుంబాలకు ఆరోగ్య శ్రీ అమలయ్యేది. ఇప్పుడు రాష్ట్రంలో 30 శాతం కుటుంబాలకు మాత్రమే ఆయుష్మాన్ భారత్ వర్తిస్తున్నది. దేశంలో ప్రతి 10 మందిలో ఒకరికే ప్రభుత్వ ఆరోగ్య బీమా ఉన్నదని గణాంకాలు చెప్తున్నాయి. నీతి ఆయోగ్ ప్రకారం ఆదాయంలో మధ్య శ్రేణివారు బీమా పరిధిలో ఉండటం లేదు. రేట్ల విషయంలోనూ ఆయుష్మాన్ భారత్ వెనుకబడే ఉన్నది. కాబట్టి ఆరోగ్యశ్రీ మాదిరిగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్తరింపజేయాలి. ఇదే సమయంలో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ధరలను సవరించాలి.
– డాక్టర్ కిరణ్ మాదాల, ఐఎంఏ రాష్ట్ర సైంటిఫిక్ కమిటీ కన్వీనర్