Minister KTR | సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే గ్రామీణాభివృద్ధిలో పాఠాలు నేర్పుతున్నదని కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని కేటీఆర్ అన్నారు. తాము చెప్పేవన్ని అల్కటి, నోటిమాటతో చెప్పే పనులే అయితే.. గత 67 సంవత్సరాల్లో ఎందుకు జరుగలేదని ప్రశ్నించారు. తొర్రూరులో నిర్వహించిన సభలో పాల్గొని మాట్లాడారు. ‘ఒక్కో గ్రామంలో ట్రాక్టర్, ట్యాంకర్ రాష్ట్రంలోని 12వేలకుపైగా గ్రామాల్లో ఉన్నమాట వాస్తవం కాదా? ఇంటి ముందర నల్లా తిప్పగానే నీళ్లు వస్తున్న మాట వాస్తవమా కాదా? ఏ గ్రామానికి వెళ్లినా హరితహారంలో పెట్టినచెట్లు స్వాగతం పలుకుతున్న మాట వాస్తవం కాదా? ఒకనాడు పట్టణాలకే పరిమితమైన పార్కులు ఇప్పుడు పల్లె ప్రకృతి వనాల పేరిట ప్రతి గ్రామంలో ఉన్న మాట వాస్తవం కాదా?
ప్రతి గ్రామంలో ఒక నర్సరీ, డంప్యార్డ్, వైకుంఠధామం, క్రీడా ప్రాంగణం ఉన్నది. పల్లూరికి ఏం కావాలి? పల్లె జనాభాకు ఏం కావాలి అని తెలిసిన ఒక నాయకుడు ముఖ్యమంత్రి ఎట్లుంటదో ఈ రోజు తెలంగాణ ఆ విషయంలో దేశం మొత్తానికే గ్రామీణాభివృద్ధిలో పాఠాలు నేర్పిస్తున్నది. గ్రామాల్లో రైతు వేదికలు, గోదాములు, ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా చెరువులు కళకళలాడుతున్నయ్. వాగులమీద చెక్డ్యామ్లు కనిపిస్తున్నయ్. గోదావరి జలాలు పాలకుర్తి, డోర్నకల్కు, మహబూబాబాద్కు వస్తున్నయ్. ఆకాశం నుంచి హెలీకాప్టర్ నుంచి చూస్తుంటే ఎర్రటి ఎండల్లోనూ కాలువల నిండా నీళ్లు కనబడుతున్నయంటే ఇది.. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా? కాదా? ఆలోచించాలని కోరుతున్నా. చెప్పినవన్నీ నోటిమాటతో అయ్యే పనులేనా? అసొంటి పనులే అయితే.. 67 సంవత్సరాలు మాకంటే ముందున్న వాళ్లు ఎందుకు చేయలేదు’ అని ప్రశ్నించారు కేటీఆర్.
‘కరెంటు పరిస్థితులు గతంలో ఎలా ఉండేవో మీకు తెలుసు. బంధువులు చనిపోయారు అరగంట కరెంటివ్వన్నా.. బాయికాడికోయి స్నానాలు చేయాలని అని బతిమిలాడుకున్న రోజులున్నయ్. కేసీఆర్ రాక ముందు కరెంటు ఉంటే వార్త.. ఈ రోజు కరెంటు పోతే వార్త అన్నది వాస్తవం కాదా? ఆలోచించాలి. కరెంటు కోసం కాపలా కాసేందుకు పాములు, తేళ్లు కుట్టి చనిపోయిన రైతుల దీనగాథలు తెలంగాణాలో ఇవాళ ఉన్నాయా? ఒకనాడు అంజుమన్ బ్యాంకు అధికారులు ఇండ్ల కిటికీలు, తలుపులు ఎత్తుకుపోదురు. ఇవాళ పరిస్థితి ఉన్నదా? మొదట్టమొదటిసారి దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత ఒక నాయకుడికి రైతుల కష్టం తెలిసి వచ్చింది. రైతుకు పెట్టుబడి ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది. రైతుబంధు రూపంలో రూ.65వేలకోట్లు 65లక్షలు ఖాతాల్లో వస్తే టింగు టింగుమని ఫోన్లకు మెస్సేజ్ వచ్చిన మాట వాస్తవం కాదా? రైతు కుటుంబానికి అండగా నిలిచేందుకు రూ.5లక్షల జీవిత బీమా అందిస్తున్న మాట వాస్తవం కాదా? రైతు చనిపోయిన తర్వాత వారం తిరగకుండానే ఖాతాల్లో జమవుతున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
‘బ్రహ్మాండంగా కడుపునిండా కరెంటు, రైతుబంధు రూపంలో పెట్టుబడి, రైతుకు దీమానిచ్చే రైతుబీమా దేశంలో ఎక్కడైనా ఉన్నదా? కరోనా సమయంలోనూ కొనుగోలు కేంద్రాలు పెట్టి రాష్ట్రవ్యాప్తంగా కల్లాల వద్దకే వచ్చి పంటను కొనుగోలు చేసిన ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడైనా ఉన్నదా? అని ఆలోచన చేయాలి. ఎన్గల్లో రైతుతో మాట్లాడుతుంటే.. కొడుకా..! కేసీఆర్ గారికి చెప్పు.. కేసీఆర్ అంటే కల్వకుంట్ల
చంద్రశేఖర్రావు కాదు. కే-కాలువలు, సీ అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు.. రైతుకు వెన్నుదన్నుగా నిలబడ్డ నాయకుడు కేసీఆర్ అనే మాట చెప్పు’ అన్నడు. ఇవాళ మీ మంత్రి చెబుతున్నరు.. ఇంకో 20 గ్రామాలు మిగిలాయి.. వాటికి కూడా నీళ్లిప్పించే బాధ్యత నాది అని చెబుతున్నరంటే ఎంత ఆరాటం, ఆర్తి, ప్రేమతో రైతుల కోసం పని చేస్తున్నరో దాన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
ఎర్రబెల్లి దయాకర్రావు కోరిక మేరకు రూ.25కోట్లు తొర్రూరు మున్సిపాలిటీకి ప్రకటిస్తున్నాం. పద్మశాలీల కోసం 20 ఎకరాల్లో కొడకొండ్లలో మినీ టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేయబోతున్నాం. ఈ మేరకు జీవో కాపీని మంత్రి దయాకర్రావుకు అందజేశారు. తొర్రూరుకు 100 పడకల, పాలకుర్తిలో 50 పడకల ఆసుపత్రులను సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకుంటా’నని హామీ ఇచ్చారు కేటీఆర్. కుట్టు మిషన్లు కావాలని ఆడబిడ్డలు దరఖాస్తు ఇచ్చారా? లొల్లి పెట్టారా? పదివేల కుట్టుమిషన్లు కావాలని ధర్నాచేశారా? మంత్రి నేనున్నాని దయాకర్రావు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏం చేస్తే లాభమవుతుందని ఆలోచన చేసి.. పాలకుర్తిలో పదివేల కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. తప్పకుండా అందరూ ఆయనను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి. మంతి ప్రజాప్రతినిధి దొరికినప్పుడు పదికాలాల పాటు కాపాడుకుంటేనే రేపటి తరాలు కూడా పేదలు, ఆడబిడ్డలకు లాభం జరుగుతుంది’ అంటూ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.