హైదరాబాద్ : ఉపాధి హామీ అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా నిలిచింది. రాష్ట్రంలో ఆ పథకాన్ని నిలిపేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందని, అందుకే రకరకాల తనిఖీలతో వేధించే ప్రయత్నం చేస్తున్నదని పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో లాగా తెలంగాణలో చేద్దామంటే కుదరదని, ఇక్కడి ప్రజలు తిరగడతారని మంత్రి హెచ్చరించారు. బోయినపల్లిలోని మల్లా రెడ్డి ఫంక్షన్ హాలులో రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం, టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్వర్యంలో జరిగిన రాష్ట్ర వ్యాప్త ఫీల్డ్ అసిస్టెంట్ల కృతజ్ఞత సభను జ్యోతి వెలిగించి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సమస్యలు సృష్టించి మొత్తం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో 2014 నుంచి 2018 వరకు కేవలం 3 టీంలను పంపిస్తే ఈ ఏడాది ఇప్పటికే 3 టీంలు ఒకసారి, 15 టీంలు ఒకసారి మొత్తం 18 టీంలను పంపించి లేని తప్పులను ఎత్తి చూపి, పేదల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారని మంత్రి విమర్శించారు.
హరిత హారం వల్ల 7.5శాతం పచ్చదనం పెరిగిందని, కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెబుతున్నాయి.పేద కూలీల కోసం ఏ సౌకర్యం కల్పించాలన్నా కేంద్రం అడ్డు పడుతున్నదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ఫీల్డ్ అసిస్టెంట్లకు అండగా ప్రభుత్వం..
మరోవైపు గతంలో కొందరి స్వార్థానికి ఫీల్డ్ అసిస్టెంట్లు బలయ్యారు. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఫీల్డ్ అసిస్టెంట్లకు మళ్లీ మంచి అవకాశం వచ్చింది. ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని మంత్రి హామీనిచ్చారు.
కార్యక్రమంలో మంత్రి మల్లా రెడ్డి, టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు, పార్టీ కార్యదర్శి రూప్ సింగ్, మర్రి రాజ శేఖర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం నేతలు మేకల రవి, కంకల సిద్ధిరాజ్, దయామణి పాల్గొన్నారు.