హైదరాబాద్ : సమైక్య రాష్ట్రంలో కరెంటు కోతలతో తల్లడిల్లిన తెలంగాణ.. స్వరాష్ట్రంలో నేడు వెలుగు జిలుగుల రాష్ట్రంగా మారిందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. శాసనసభకు ఆయన బడ్జెట్ను సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరెంటు కష్టాలకు చరమగీతం పాడి తెలంగాణ చరిత్రకెక్కిందన్నారు. 24 గంటల నాణ్యమైన కరెంటును అన్ని రంగాలకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు.
చరిత్రలో అనేక మంది ముఖ్యమంత్రులు అధికార పీఠాన్ని ఎక్కారని, దిగారనీ.. కానీ వారెవ్వరు కరెంటు సమస్యను పరిష్కరించలేకపోయారన్నారు. అది ఒక్క సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరాల్లో నాటికి నేటికి హస్తిమశకాంతరం తేడా ఉందన్నారు. 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ ఉత్పత్తి వినియోగం 1110 యూనిట్లు కాగా.. 2021 నాటికి 2012 యూనిట్లకు చేరుకుందన్నారు. జాతీయ తలసరి విద్యుత్తు వినియోగంతో పోలిస్తే మనరాష్ట్ర తలసరి వినియోగం 73శాతం అధికంగా ఉందని, ఇది రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించే అద్భుతమైన సూచిక అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న సోలార్ విద్యుత్తు 4431 మెగావాట్లు అనీ, రాబోయే రెండేళ్లలో 7వేల మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం భద్రాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణం పూర్తి చేసి, ఉత్పత్తిని ప్రారంభించిందన్నారు. మొత్తం నాలుగు యూనిట్ల 1080 మెగావాట్ల విద్యుత్తు నిరంతరాయంగా ఉత్పత్తి చేస్తోందన్నారు.
నల్గొండ జిల్లాలో టీఎస్ జెన్కో నిర్మిస్తున్న యాదాద్రి నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. 2023 సంవత్సరానికి ఈ విద్యుత్తు కేంద్రం అందుబాటులోకి వస్తుందని, తెలంగాణ రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రంగా అవతరిస్తుందన్నారు. గత మార్చిలో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ గరిష్ఠంగా 13,688 మెగావాట్లకు చేరగా.. రాబోయే రోజుల్లో 17వేల మెగావాట్ల డిమాండ్ వచ్చినా సజావుగా జరిగేలా పంపిణీ సరఫరా వ్యవస్థలను ప్రభుత్వం పటిష్టం చేసిందని, ఇందుకు రూ.34,970 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
గతంలో పవర్ హాలీడేతో కునారిల్లిన పరిశ్రమలు నేడు.. మూడు షిఫ్ట్లు పని చేస్తున్నాయని, కార్మికులకు నిరంతరం ఉపాధి లభిస్తుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్కు నిరంతర విద్యుత్ సరఫరా కోసం సీఎం కేసీఆర్ ఆదేశానుసారం 400కేవీ, 200 కేవీ సరఫరా వ్యవస్థను ప్రభుత్వం పటిష్టం చేసిందని చెప్పారు. వీటితో రాజధాని ప్రాంతంలో విద్యుత్ అంతరాయం క్షణకాలం ఏర్పడదని హరీశ్రావు స్పష్టం చేశారు.