హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ప్రజారోగ్య పరిరక్షణ, వైద్యారోగ్యరంగ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్ఠమైన చర్యలతో రాష్ట్రం ‘ఆరోగ్య తెలంగాణ’గా అవతరించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. వైద్యారోగ్యరంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఉమ్మడి పాలనలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే కరువైన గడ్డు పరిస్థితుల నుంచి నేడు స్వరాష్ట్రంలో జిల్లాకో మెడికల్, పారా మెడికల్, నర్సింగ్ కాలేజీలను స్థాపించుకునే దశకు చేరుకున్నామని తెలిపారు. మెడికల్ కాలేజీల సీట్లు భారీగా పెంచి, ప్రభుత్వ దవాఖానలు, మెడికల్, నర్సింగ్ కాలేజీల్లో అవసరాలకు అనుగుణంగా సిబ్బంది నియామకం చేపట్టడం ద్వారా వైద్యం సామాన్యుడికి చేరువైందని వెల్లడించారు. సాధారణ బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్ బెడ్ల సంఖ్య పెంపు, ప్రతి దవాఖానలో అన్ని రకాల వైద్య పరికరాలు, మందులు, ల్యాబొరేటరీల ఏర్పాటుతో ప్రజావైద్యంలో గుణాత్మక మార్పు చోటు చేసుకున్నదని పేర్కొన్నారు.
మెడికల్ హబ్గా వరంగల్
హైదరాబాద్ సహా వరంగల్ వంటి ముఖ్య పట్టణాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణంతో ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యసేవలు అందబోతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని నిమ్స్ను అదనంగా 2,500 పడకలతో విస్తరించడంతోపాటు, వరంగల్ను ‘మెడికల్ హబ్’ గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, ఆరోగ్యలక్ష్మి, అమ్మఒడి, ఆరోగ్య మహిళ వంటి పథకాలు, బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు, తెలంగాణ డయాగ్నస్టిక్స్, ఆరోగ్య శ్రీ, ఎంప్లాయిస్ అండ్ జర్నలిస్ట్స్ హెల్త్ సీం, ఉచిత డయాలసిస్, 108 అత్యవసర ఆరోగ్య రవాణా సేవలు, పాలియేటివ్ కేర్తోపాటు కంటి వెలుగుతో ఇప్పటివరకు కోటి మందికి పరీక్షలు చేసి 69 లక్షల మందికి అద్దాలు అందించినట్టు తెలిపారు.
అన్ని సూచీల్లో మెరుగైన స్థానంలో తెలంగాణ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా కేంద్రం నిర్వహించిన హెల్త్ అండ్ ఫిట్నెస్ క్యాంపెయిన్లో మూడు క్యాటగిరీల్లో అవార్డులు ప్రకటించగా, తెలంగాణ ఆ మూడింటిలోనూ అవార్డులు సాధించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. నీతి ఆయోగ్ విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచీలో రాష్ట్రం మూడో స్థానాన్ని సాధించిందని గుర్తుచేశారు. కేంద్ర ఆర్థిక సర్వే 2022- 2023 ప్రకారం దక్షిణ భారతదేశంలో ప్రజావైద్యంపై చేస్తున్న ఖర్చులో ప్రభుత్వ వాటా ఎకువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 2వ స్థానంలో నిలిచిందని తెలిపారు.