హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించడంలో ఏపీ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని తెలంగాణ అధికారులు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ, ఏపీ సంయుక్త సాంకేతిక సమావేశం జరిగింది. పీపీఏ తరఫున సభ్య కార్యదర్శి రఘురాం, డైరెక్టర్ దేవేందర్రావు, ఏపీ తరఫున చీఫ్ ఇంజినీర్లు సుధాకర్బాబు, పుల్లారావు హాజరవగా.. తెలంగాణ తరఫున ఈఎన్సీ (ఓఅండ్ఎం) బీ నాగేందర్రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, కొత్తగూడెం సీఈ శ్రీనివాస్రెడ్డి, భద్రాచలం ఎస్ఈ వెంకటేశ్వర్రెడ్డి, ఐఎస్డబ్ల్యూఆర్ గోదావరి యూనిట్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రమణ్య ప్రసాద్ పాల్గొన్నారు. ఈ నెల 3న కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో జరిగిన 3వ సాంకేతిక సమావేశ నిర్ణయాల ప్రకారం.. పోలవరం ముంపును అంచనా వేసేందుకు చేపట్టాల్సిన సంయుక్త సర్వేపై బుధవారం చర్చించాల్సి ఉన్నది.
కానీ ఏపీ, పీపీఏ నిర్లక్ష్యం వల్ల ఈ అంశం చర్చకు రాలేదని తెలంగాణ అధికారులు ధ్వజమెత్తారు. ముంపునకు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ ఈ నెల 6నే పీపీఏకి అందించింది. దాన్ని బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పీపీఏ తమకు ఇచ్చిందని, కాబట్టి మరింత సమయం కావాలని ఏపీ కోరింది. దీంతో రాష్ట్ర అధికారులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేకసార్లు సమాచారాన్ని పీపీఏకి, దాని ద్వారా ఏపీకి పంపామని గుర్తుచేశారు. కుంటి సాకులు చెప్తూ జాప్యం చేస్తుండటంపై నిరసన వ్యక్తం చేశారు. 10న సమావేశం నిర్వహించాలని కేంద్ర జలసంఘం ఆదేశించినా పీపీఏ పట్టించుకోలేదని, బుధవారం 3గంటలకు వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారని పేర్కొన్నారు.