హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాలపై కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ ఎలాంటి నీటి పంపకాలను చేపట్టలేదని తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణకు 6.04, ఏపీకి 26.29 టీఎంసీలను కేటాయిస్తున్నట్టు కేఆర్ఎంబీ ప్రతిపాదించిందని వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలకు ఖండించారు.
ఈ నెల 21న తెలంగాణ గైర్హాజరుతో త్రిసభ్య కమిటీ సమావేశం జరగలేదని, తాగునీటి అవసరాలపై మాత్రమే కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ చర్చించారని తెలిపారు. ఎలాంటి నీటి పంపకాలూ జరగలేదని, ప్రతిపాదనలకు తెలంగాణ అంగీకరించలేదని, బోర్డు కూడా ఎలాంటి లేఖలు రాయలేదని స్పష్టం చేశారు.
త్రిసభ్య సమావేశాన్ని నిర్వహించి, ఇప్పటివరకు ఇరు రాష్ట్రాల వినియోగాలు, నీటి నిల్వలను పరిగణనలోకి తీసుకోవాలని, తాగునీటి అవసరాలను మదింపు చేసి ఆ మేరకు కేటాయింపులు జరపాలని త్రిసభ్య కమిటీ కన్వీనర్ (మెంబర్ సెక్రటరీ)ను గురువారం కలిసిన సందర్భంగా రాష్ట్ర ఈఎన్సీ మురళీధర్ డిమాండ్ చేశారు. ఇరు రాష్ర్టాల అంగీకారం మేరకే తాగునీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.