Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అనతికాలంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. చిన్న రాష్ట్రమైనప్పటికీ దేశంలోని పెద్ద రాష్ర్టాలతో పోటీ పడుతున్నది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచే పటిష్ఠమైన ఆర్థిక ప్రణాళికతో ముందుకెళుతున్నది. ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుంటూనే, వాటిని రెట్టింపు చేయడంపై దృష్టి సారించింది. ప్రతి రూపాయిని అభివృద్ధి, సంక్షేమం కోసం వెచ్చిస్తున్నది. అందులో భాగంగానే వాణిజ్య పన్నుల శాఖపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పన్ను వసూళ్లు, అవగాహన కల్పించడం తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. వాణిజ్య పన్నులశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త సంస్కరణలతో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో పన్ను రాబడి గణనీయంగా పెరిగింది. జీఎస్టీ వసూళ్లలో ఊహించని వృద్ధిరేటు నమోదైంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు రూ.11,639 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు రూ.24,052 కోట్ల జీఎస్టీ వచ్చింది. అంటే.. కేవలం ఐదేండ్లలోనే జీఎస్టీ రాబడి డబుల్ అయ్యింది.
2019-20 ఆగస్టుతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో వసూలైన జీఎస్టీ రూ.12,413 కోట్లు ఎక్కువ. జీఎస్టీ వసూళ్లలో మొదటి నుంచి తెలంగాణ ఆశించిన ఫలితాలనే సాధిస్తున్నది. ప్రపంచమంతా కరోనాతో ఆర్థికంగా చితికిపోయిన 2020-21వ ఆర్థిక సంవత్సరం మాత్రం ఆగస్టు వరకు కేవలం రూ.8,224 కోట్లు మాత్రమే వసూలైంది. ఆ తర్వాత మళ్లీ యథావిధి స్థాయికి చేరుకున్నది. 2021-22లో ఆగస్టు వరకు రూ.12,461 కోట్లు, ఆ తర్వాత ఏడాది ఆగస్టు వరకు రూ.16,332 కోట్లు జీఎస్టీ రూపంలో వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం అనూహ్యమైన వసూళ్లను సాధించింది. నిరుడు ఆగస్టుతో పోలిస్తే ఈసారి ఆగస్టు వరకు రూ.7,720 కోట్ల జీఎస్టీ అధికంగా వసూలైంది. కేంద్రంలోని మోదీ సర్కారు సహకరించకున్నా, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మోకాలడ్డుతున్నా, తెలంగాణ మాత్రం సొంతకాళ్లపై నిలబడుతూ బలమైన ఆర్థిక పునాదిని వేసుకుంటున్నది.
బడ్జెట్ అంచనాల్లో 47 శాతం రాబడి
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పటిష్ఠ ఆర్థిక ప్రణాళికలతో రాష్ట్రం ఏటికేడు ఆర్థిక వృద్ధిని సాధిస్తూనే ఉన్నది. ప్రత్యేకించి.. జీఎస్టీ వసూళ్లలో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నుంచే దూకుడు ప్రదర్శిస్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్లో రూ.5,622 కోట్ల జీఎస్టీ వసూలైంది. నిరుటితో పోలిస్తే రూ.667 కోట్లు (13%) ఎక్కువ. మేలో రూ.4,507, జూన్లో రూ.4,681, జూలైలో రూ.4,847, ఆగస్టులో రూ.4,393 కోట్లు వసూలైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రూపంలో రూ.50,942 కోట్లు వస్తాయని బడ్జెట్లో అంచనా వేయగా మొదటి ఐదు నెలల్లోనే రూ.24,052 కోట్ల రాబడి వచ్చింది. అంటే బడ్జెట్ అంచనాల్లో మొదటి 5 నెలల్లోనే 47 శాతం రాబడి సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 7 నెలలు మిగిలి ఉన్నాయి. ఇదే దూకుడు ప్రదర్శిస్తే ఈసారి అంచనాల మించి రాబడి వస్తుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.