హైదరాబాద్ : తెలంగాణ వైద్య, ఆరోగ్య రంగం దేశానికే ఆదర్శంగా మారుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రానికి చెందిన 13 ప్రభుత్వ ఆసుపత్రులు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ నుంచి నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ (NQAS) సర్టిఫికెట్లు సాధించాయి. అలాగే మరో మూడు దవాఖానలకు రీ-సర్టిఫికేషన్ వచ్చిందని హరీశ్రావు తెలిపారు. లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్ నిర్వహణలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు నిర్మల్ ఏరియా దవాఖానకు ‘లక్ష్య’ గుర్తింపు లభించింది.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ.. రాష్ట్ర ప్రభుత్వానికి రాసి.. శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 143 హాస్పిటల్స్కు ఎన్క్వాష్ గుర్తింపు వచ్చిందని, ఈ గుర్తింపు కలిగిన దవాఖానలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో హరీశ్రావు తెలిపారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఈ గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొదటి స్థానమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ దవాఖానలకు జాతీయ స్థాయి గుర్తింపు రావడంపై హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు.
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ వైద్య సేవల్లో నాణ్యతా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయన్న మంత్రి.. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ జాతీయస్థాయి గుర్తింపే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో పీహెచ్సీ స్థాయి నుంచి ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తుందన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైన జాతీయస్థాయి నాణ్యతా ప్రమాణాల గుర్తింపును తెలంగాణలోని జిల్లా, ప్రాంతీయ, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సాధిస్తున్నాయంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి అభినందనలు తెలిపారు.