హైదరాబాద్: క్యాన్సర్ రోగులకు త్వరలో జిల్లాల్లోనే కీమోథెరపీ చేయించుకునే సదుపాయం కల్పించనున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్రావు (Minister Harish Rao) చెప్పారు. ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డితో కలిసి నూతన ఆంకాలజీ బ్లాక్ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి హరీష్రావు మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రిలో నూతన బ్లాకును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇంత మంచి బిల్డింగ్ను నిర్మించి ప్రభుత్వానికి అందించినందుకు అరబిందో ఫార్మాకు ధన్యవాదాలు చెప్పారు.
నూతన బిల్డింగ్తో ఆస్పత్రిలో పడకల సంఖ్య 750 కి పెరిగిందని, ప్రభుత్వపరంగా రూ.60 కోట్లతో ఇక్కడ అన్ని సదుపాయలు కల్పించామని మంత్రి హరీశ్రావు తెలిపారు. దేశంలోనే ప్రభుత్వ రంగంలో కాన్సర్ చికిత్సకు రెండో అతిపెద్ద ఆస్పత్రిగా ఎంఎన్జే నిలిచిందన్నారు. కొత్త బ్లాక్లో ప్రత్యేకంగా విమెన్ వింగ్, పీడియాట్రిక్ వింగ్ రానున్నాయని చెప్పారు. చికిత్స కోసం వచ్చే చిన్నారుల చదువు దెబ్బతినకుండా పీడియాట్రిక్ వింగ్లో లైబ్రరీని, టీచర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కు ప్రత్యేకంగా వార్డ్ ఏర్పాటు చేశామని, వారికి ఆరోగ్య శ్రీ కింద జీవితాంతం మందులు ఉచితంగా ఇస్తామని మంత్రి చెప్పారు.
పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని సూపర్ స్పెషాలిటీ సేవలు పెంచడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ వైద్య సదుపాయాలను ఎంతో పటిష్టం చేశారని, గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఎంఎన్జే వంటి హాస్పిటళ్లను బలోపేతం చేశారని వెల్లడించారు. నాలుగు టిమ్స్ ఆస్పత్రులు, వరంగల్ హెల్త్ సిటీ, నిమ్స్ విస్తరణతో 10వేల పడకలు సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. అవి మరో ఏడాదిలో అందుబాటులోకి వస్తాయన్నారు. వైద్య విద్యకు కూడా ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని, ఈ సంవత్సరం మరో 9 మెడికల్ కాలేజీలను ప్ర్రారంభిస్తామని మంత్రి తెలిపారు.
తెలంగాణ వస్తే ఏం వస్తుందన్న వాళ్లకు ఇవే మంచి సమాధానమని మంత్రి చెప్పారు. 2014లో 20 మెడికల్ కాలేజీలు ఉంటే 2022 నాటికి 46కు చేరుకున్నాయని, ఈ ఏడాదితో 55 అవుతాయని తెలిపారు. 65 ఏండ్లలో 20 మెడికల్ కాలేజీలు వస్తే 9 ఏండ్లల్లోనే 35 కాలేజీలు తెచ్చామన్నారు. మెడికల్ సీట్లు నాడు 2950 ఉంటే ఇప్పుడు 7990 కి పెరుగుతాయని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కాన్సర్కు సంబంధించి ఆరోగ్య శ్రీ ద్వారా రూ.800 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. గత సంవత్సరం రూ.137 కోట్లు కేవలం కాన్సర్ పేషెంట్స్ కి ఖర్చు చేశామని, త్వరలో కీమోథెరపీ, రేడియో థెరపీని కూడా జిల్లాల్లో ప్రారంభిస్తామని చెప్పారు.
డయాగ్నస్టిక్ సెంటర్ల ద్వారా కాన్సర్ను డిటెక్ట్ చేయబోతున్నామని, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ఆహార నియమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, నిత్యం వ్యాయామం చేయాలని చెప్పారు. ఆస్పత్రి శానిటేషన్, సెక్యూరిటీ నిర్వహణకు ముందుకొచ్చిన వైద్యులు అద్దంకి శరత్, సినీ నిర్మాత సునీతలను మంత్రి హరీశ్ రావు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీ ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, అరబిందో ఎమ్డీ నిత్యానంద రెడ్డి, అరబిందో డైరెక్టర్ రఘునాథన్, హెల్త్ సెక్రెటరీ రిజ్వి, ఎంఎన్జే ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ జయలత తదితరులు పాల్గొన్నారు.