బీజేపీ కోరిన విధంగానే నిందితులు కూడా సీబీఐ దర్యాప్తు అభ్యర్థించారు. వారు కోరినట్టుగానే సింగిల్ జడ్జి ధర్మాసనం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. అలాంటప్పుడు బీజేపీ పిటిషన్ను కొట్టేసినా ఆ పార్టీ కోరిన అభ్యర్థనను ఆమోదించినట్టే అవుతుంది. అందుకే అప్పీల్ పిటిషన్ వేశాం. అంతేకాకుండా ఇందులో చాలా విషయాలున్నాయి. వాటిని వివరించే ప్రయత్నంలో భాగంగానే అప్పీల్ దాఖలు చేశాం.
-హైకోర్టు ధర్మాసనానికి ఏజీ వివరణ
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్తో రాజకీయ వైరం ఉంటే కోర్టు బయట చూసుకోవాలని బీజేపీని ఉద్దేశించి రాష్ట్ర హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పరువు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయని అనుకొంటే చట్టప్రకారం పరువు నష్టం దావా వేసుకొనే వెసులుబాటు ఉన్నదని స్పష్టంచేసింది. రాజకీయాలకు కోర్టులను వేదికలుగా మార్చవద్దని హితవు పలికింది. ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సిట్, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారించింది. బీజేపీ నేత ప్రేమేందర్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సీ దామోదర్రెడ్డి వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ అధినేతపై ఆరోపణలు చేశారు. ఈ సమయంలో జోక్యం చేసుకొన్న చీఫ్ జస్టిస్, రాజకీయ ఆరోపణలు ఇకడ ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ వైరం ఉంటే కోర్టు బయట చూసుకోవాలని స్పష్టంచేశారు.
బీజేపీ కుట్రలు బయటకు రావాల్సిందే..
బీజేపీ పిటిషన్ను సింగిల్ జడ్జి కొట్టేసిన తర్వాత కూడా దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అప్పీల్ చేసిందన్న ధర్మాసనం ప్రశ్నకు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ సమాధానం చెప్పారు. బీజేపీ కుట్రలను బహిర్గతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని తెలిపారు. కేసుతో సంబంధం లేదని చెప్తూనే నిందితుల కంటే ముందుగా బీజేపీ రిట్ పిటిషన్ దాఖలు చేసిందని గుర్తుచేశారు. ఇతర కుట్ర కోణాలను కూడా బహిర్గతం చేయాలనే ఉద్దేశంతో అప్పీల్ చేసినట్టు తెలిపారు.
‘బీజేపీ కోరిన విధంగానే నిందితులు కూడా సీబీఐ దర్యాప్తు అభ్యర్థించారు. వారు కోరినట్టుగానే సింగిల్ జడ్జి ధర్మాసనం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. అలాంటప్పుడు బీజేపీ పిటిషన్ను కొట్టేసినా ఆ పార్టీ అభ్యర్థనను ఆమోదించినట్టే అవుతుంది. అందుకే అప్పీల్ పిటిషన్ వేశాం. అంతేకాకుండా ఇందులో చాలా విషయాలున్నాయి. వాటిని వివరించే ప్రయత్నంలో భాగంగానే అప్పీల్ దాఖలు చేశాం’ అని ఏజీ తెలిపారు.
సిట్పై ఒత్తిడి చేయొద్దు
కేసుకు సంబంధించిన ఫైల్స్ ఇవ్వాలని సిట్ను ఒత్తిడి చేయరాదని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. సీబీఐ ఫైల్స్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్న విషయాన్ని ఏజీ బీఎస్ ప్రసాద్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. అప్పీళ్లపై తాము విచారణ జరుపుతున్నామని, తదుపరి విచారణ జరిగే ఈ నెల 9వ తేదీ (సోమవారం) వరకు మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఫైల్స్ ఇవ్వాలని సిట్పై ఒత్తిడి చేయరాదని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.