హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): మునుగోడులో కొత్త ఓటర్ల నమోదుపై చిల్లర రాజకీయం చేయాలనుకొన్న బీజేపీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఓటర్ల నమోదు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. నామినేషన్లు దాఖలు చేసే చిట్టచివరి రోజు వరకు కొత్త ఓటర్ల నమోదుకు చట్టంలో వీలున్నదని శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాసర్రెడ్డి ధర్మాసనం తేల్చిచెప్పింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో 19 వేల కొత్త ఓటర్ల నమోదుపై ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? ఈ పిటిషన్లో ఇప్పటికిప్పుడు ఉత్తర్వులు జారీచేయాల్సిన అవసరం ఎకడ ఉందో చెప్పండని బీజేపీ పిటిషనర్ను ప్రశ్నించింది. ఓటర్ల నమోదుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించింది. తదుపరి విచారణను 21కి వాయిదా వేస్తున్నామని, కొత్త ఓటర్ల నమోదు ఏ విధంగా జరిగిందో సమగ్ర వివరాలను నివేదించాలని ఈసీకి ఉత్తర్వులు జారీచేసింది.
బీజేపీ పిటిషనర్ ఉక్కిరిబిక్కిరి
మునుగోడు నియోజకవర్గంలో ఈ ఏడాది జనవరి నుంచి జూలై 31 నాటికి 1,471 ఓటర్లు నమోదైతే.. గత 70 రోజుల్లో 24,781 ఓట్లు నమోదవడం వెనుక అధికార టీఆర్ఎస్ హస్తం ఉన్నదంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన సందర్భంగా పిటిషనర్కు పలు ప్రశ్నలు సంధించింది. చట్టంలోని 23(3) నిబంధన ప్రకారం నామినేషన్ దాఖలుచేసే చివరిరోజు వరకు ఓటర్ల నమోదుకు వీలున్న దశలో పిటిషనర్ హైకోర్టు నుంచి ఏ తరహా ఉత్తర్వులు కోరుతున్నారో చెప్పాలని ప్రశ్నించింది. ‘పాతికవేల కొత్త ఓటర్ల నమోదు వద్దంటున్న పార్టీ, రేపు ఎన్నికల్లో గెలుపొందితే ఈ విషయాన్ని వదిలేస్తుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో 19 వేల కొత్త ఓట్ల నమోదుపై ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? ఈ పిటిషన్లో ఇప్పటికిప్పుడు ఉత్తర్వులు జారీచేయాల్సిన అవసరం ఎకడ ఉందో చెప్పండి? ఇప్పటికైనా పిటిషనర్కు ఏ ఆర్డర్ కావాలో చెప్పాలి.
ఎన్నిక రద్దుచేస్తూ ఆర్డర్ ఇవ్వమంటారా? ఇవి కాదంటే ఓటర్ల జాబితాపై స్టే కావాలా? ఈ కోర్టు నుంచి ఏం కోరుతున్నారో చెప్పండి?’ అని హైకోర్టు ప్రశ్నలు ఉంచింది. ఆమోదించని 5 వేల దరఖాస్తులను పెండింగ్లో పెట్టాలని బీజేపీ తరపు న్యాయవాది కోరగా, ఏ నిబంధన కింద అలాంటి ఉత్తర్వులు కోరుతున్నారో చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది. ‘ఒకవేళ రేపు పిటిషనర్ పార్టీ గెలుపొందితే, పాతిక వేల దరఖాస్తులపై లేవనెత్తిన అభ్యంతరం పట్టించుకోదు. ఏడెనిమిది వేల ఓట్ల తేడాతో ఫలితం ఉంటే మరోలా మాట్లాడతారు. ఈసీ తెలంగాణ రాష్ట్రం కోసమే లేదు. ఓటర్ల నమోదు ప్రక్రియలో ఈసీ గుడ్డిగా ఏమీ చేయటం లేదు. హుజారాబాద్లో 19 వేల కొత్త ఓట్లు నమోదైనప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు.? ఈ రిట్పై ఇప్పటికిప్పుడు హడావుడిగా ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఏమీలేదు’అని ధర్మాసనం తేల్చిచెప్పింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
హుజూరాబాద్లోనూ ఓట్లు పెరిగాయి
మునుగోడులో గత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 25 వేల దరఖాస్తులు వచ్చాయని, 12,249 వేల ఓటర్ల నమోదుకు అనుమతి లభించగా, 7,247 దరఖాస్తులు తిరసరణకు గురయ్యాయని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాష్ దేశాయ్ చెప్పారు. ‘ప్రస్తుతం 5517 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని పరిశీలించిన తర్వాత అధికారులు వాటిపై శుక్రవారం తుది నిర్ణయం తీసుకొంటారు. మునుగోడులో గురువారం నాటికి 2,38,759 ఓట్లు ఉన్నాయి. ఏటా నియోజకవర్గ ఓట్లు పెరుగుదల సర్వసాధారణం’ అని ఆయన తెలిపారు.