హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంపై రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (రెడ్కో) చైర్మన్ వై సతీశ్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. సిట్ విచారణ కొనసాగించాలని కోర్టు సూచించడంతో బీజేపీ నేతల్లో వణుకు మొదలైందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసులో బీజేపీ నేతలు చేస్తున్న హడావిడే ఈ వ్యవహారం వెనుక వారి ప్రమేయం ఉన్నదనడానికి నిదర్శనమని చెప్పారు. ఈ వ్యవహారంలో బీజేపీకి సంబంధం లేదంటూనే.. ప్రేమేందర్రెడ్డి సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ ఎందుకు వేశారు? అని ప్రశ్నించారు.
సీబీఐ కేంద్రం చేతిలో చిలుక కాబట్టే కేసును కేసును ఆ సంస్థకు బదిలీ చేయాలని బీజేపీ కోర్టును ఆశ్రయించిందని ఆరోపించారు. సిట్ విచారణతో బీజేపీ జాతీయ నాయకుల బండారం బయటపడుతుందనే భయంతోనే సుప్రీంకోర్టు వరకు వెళ్లారని ఆరోపించారు. నంబర్ 2 డైరెక్షన్లోనే రాష్ట్ర బీజేపీ నాయకులు పనిచేస్తున్నారని, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఇతర రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ చేసిన కుట్రలన్నీ సిట్ విచారణలో బహిర్గతం కాబోతున్నాయని తెలిపారు.