చేర్యాల/కొమురవెల్లి, జూలై 26 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ ప్రారంభం భక్తులకు, ప్రాంతీయ అభివృద్ధికి చరిత్రాత్మక ఘట్టమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి అన్నారు. కొమురవెల్లి మల్లన్న క్షేత్రం సమీపంలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన రైల్వేస్టేషన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీలు రఘునందన్రావు, చామల కిరణ్కుమార్రెడ్డి, లక్ష్మణ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, పింగిలి శ్రీపాల్రెడ్డి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ, సర్పంచ్ గొలపల్లి పద్మతో కలిసి కిషన్రెడ్డి ప్రారంభించారు. అలాగే సిద్దిపేట-సికింద్రాబాద్ డెమోను ప్రారంభించి కేంద్ర మంత్రి, ఎంపీలు కొమురవెల్లిలో రైలు ఎక్కి గజ్వేల్ స్టేషన్లో దిగారు. అనంతరం జరిగిన సభలో కిషన్రెడ్డి మాట్లాడుతూ.. కొమురవెల్లి స్టేషన్ను మరింత ఆధునీకరిస్తామని అన్నారు. అదనపు ప్లాట్ఫారాలు, మరిన్ని సౌకర్యాలు కల్పించాలని, రైల్వే స్టేషన్ నుంచి ఆలయం వరకు ఆర్టీసీ అధికారులు షటిల్ బస్సుల సేవలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ, చొరవతో కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్కు మోక్షం కలిగిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. భూసేకరణ వేగవంతంగా చేపట్టడం వల్ల రైల్వే లైన్, స్టేషన్ల నిర్మాణానికి ఉపయోగపడిందని అన్నారు. కేసీఆర్ నిధులు కేటాయించి, భూసేకరణ చేసిన తరువాత హరీశ్రావు నిర్మాణ పనులు పూర్తయ్యేలా చేశారని చెప్పారు. మొదటి విడతలో గజ్వేల్, సిద్దిపేట, దుద్దెడ, లకుడారం తదితర పనులు పూర్తయ్యాయని, అనంతరం కొమురవెల్లి రైల్వే స్టేషన్ పనులు ఊపందుకున్నట్టు తెలిపారు.ప్రసాద్ స్కీమ్లో కొమురవెల్లి మల్లన్న క్షేత్రాన్ని చేర్చాలని కోరారు.