హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లలోని 82, 83 సర్వే నంబర్లల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబసభ్యులు, ఇతరులకు మధ్య తలెత్తిన భూవివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. తాము కొనుగోలు చేసిన ఆ భూముల్లో జోక్యం చేసుకోకుండా పేట్బషీరాబాద్ ఏసీపీ, డీసీపీ, ఇన్స్పెక్టర్తోపాటు కుత్బుల్లాపూ ర్ ఎమ్మార్వోను ఆదేశించాలని కోరు తూ మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్రెడ్డి, కుమారుడు మహేందర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ అనిల్ కుమార్ గురువారం విచారణ చేపట్టారు. జీడిమెట్లలోని 2.14 ఎకరాల భూమిని పిటిషనర్లు, వారి కుటుంబసభ్యులు 2011లో కొనుగోలు చేసి లీజుకు ఇచ్చినట్టు వారి తరఫు న్యాయవాది చెప్పారు. ఆ భూమి తమదేనంటూ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఇటీవల అక్కడ ఉన్న రేకుల షీట్లను తొలగించారని, దీంతో పిటిషనర్లకు సమాచారం ఇవ్వకుండా ఆ భూమిని ఏకపక్షంగా సర్వే చేసేందుకు ఎమ్మార్వో, ఏసీపీ, ఇన్స్పెక్టర్ వచ్చారని వివరించారు. ఆ భూమి నుంచి చట్టవిరుద్ధంగా పిటిషనర్లను ఖాళీ చేయించే ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. దీంతో మధ్యంతర ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. కౌంటర్లు దాఖలు చేయాలని రెవెన్యూ, పోలీస్ అధికారులకు నోటీసులు జారీచేసింది. ఆ భూమికి సంబంధించి కేసుల రికార్డులను సమర్పించాలని ఆదేశించి, తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.