హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): అయిపోయింది. ఆఖరి ఆశ కూడా ఆవిరైంది. ఆదిలాబాద్లో అపార సహజ వనరులను కలిగివున్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునరుద్ధరణకు అవకాశమున్నప్పటికీ కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు మాత్రం కర్కశంగా బలిపీఠం వైపే నడిపింది. సుమారు వందేండ్ల పాటు నడిపేందుకు అవసరమైనంత లైమ్స్టోన్ (సున్నపురాయి) నిల్వలు ఈ ఫ్యాక్టరీని ఆనుకునే ఉన్నప్పటికీ శూన్య హస్తమే చూపింది. ఈ ఫ్యాక్టరీని బతికించేందుకు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ ఎన్నోసార్లు విన్నవించినా కేంద్ర బడ్జెట్లో నయాపైసా విదిల్చలేదు.
రోజుకు 1,200 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో 1984లో ప్రారంభమైన ఈ ఫ్యాక్టరీ లాభాల బాటలో కొనసాగుతున్నప్పటికీ 1991-92లో కేంద్రం ఉన్నట్టుండి మూలధనాన్ని ఇవ్వడం మానేసింది. దీంతో ఆర్థిక కుదుపులు మొదలై ఆ కర్మాగారం మెల్లమెల్లగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఫలితంగా 1998 నవంబర్ 5న ఆ ఫ్యాక్టరీని పూర్తిగా మూసివేశారు. 2,074.09 ఎకరాల్లో 48.18 మిలియన్ టన్నుల సున్నపురాయి గనులున్న సీసీఐని పునరుద్ధరించి, మళ్లీ లాభాల్లోకి తీసుకురావచ్చని 1995లో ఏర్పాటైన మంత్రుల బృందంతోపాటు, బీఐఎఫ్ఆర్, హోటెక్ కన్సల్టెంట్స్ సంస్థలు చాలా కాలం క్రితమే కేంద్రానికి నివేదించాయి. అయినా ఆ కర్మాగారాన్ని పునరుద్ధరించేందుకు మోదీ సర్కార్ ఎలాంటి ప్రయత్నం చేయలేదు.
లేఖలు, విజ్ఞప్తులు బుట్టదాఖలు
సీసీఐని పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నోసార్లు కేంద్రాన్ని కోరింది. కర్మాగార పునరుద్ధరణకు సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొంటూ మంత్రి కేటీఆర్ పలుమార్లు లేఖలు రాయడంతోపాటు స్వయంగా కేంద్ర మంత్రులకూ విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ కర్మాగార పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ ప్రజలు, ప్రజాప్రతినిధులు నిరసనలు, ధర్నాలకు దిగినా కేంద్రం కనికరించలేదు. బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆ కర్మాగార పునరుద్ధరణ గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు.