హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో గిరిజనులకు పోడు పట్టాలను అందజేసినట్టు గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టంచేశారు. ఆదివారం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకొన్నారు. రంగనాయకుల మండపం లో మంత్రికి అర్చకులు వేదాశీర్వచనం, తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. దేశంలో ఎకడా లేనివిధంగా గిరిజన బిడ్డలను భూయజమానులను చేసిన ఘనత కేసీఆర్కే దకుతుందని చెప్పారు. గిరిజనుల అభ్యున్నతి కోసం 3,146 ఆదివాసీ గూడేలు, తండాలను గ్రామ పంచాయతీలు చేయడం, 2 వేల కోట్లతో బీటీ రోడ్లు, గిరి వికాసం, గిరిజన ఆవాసాలకు త్రీ ఫేజ్ విద్యుత్తు సౌకర్యం కల్పించడంతోపాటు దేశంలో ఎకడాలేని విధంగా గిరిజన గురుకులాల ఏర్పాటు, గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంచి కేసీఆర్ గిరిజన బాంధవుడిగా నిలిచారని కొనియాడారు. అవినీతి గురించి మాట్లాడే మోదీ.. దేశం పరువు ప్రతిష్టలు తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ ప్రధానిలా కాకుండా గుజరాత్ మనిషిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉద్యమంలో కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్ కీర్తి.. ఇప్పుడు ఢిల్లీకి తాకడంతో మోదీకి భయం పట్టుకున్నదని అన్నారు. అందుకే కేసీఆర్ని టార్గెట్ చేసి చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
పోడు పట్టాల పంపిణీ
ఖలీల్వాడి(మోపాల్)/నల్లబెల్లి, జూలై 9: రాష్ట్రంలో పోడు పట్టాల పంపిణీ కొనసాగుతున్నది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో 53.09 ఎకరాల పరిధిలో 24 మందికి, జక్రాన్పల్లి మండలంలో నలుగురు లబ్ధిదారులకు ఆదివారం నిజామాబాద్లో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పోడు పట్టాలు పంపిణీ చేశారు. రూరల్ నియోజకవర్గంలో మొత్తం మూడు వేల మంది గిరిజనులకు దాదాపు 1,700 ఎకరాల పోడు భూములను పంపిణీ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం ఆసరవెల్లి గ్రామంలో ఆదివారం 366 రైతులకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శరెడ్డి పోడు పట్టాలు అందజేశారు. పట్టాలు పొందిన ప్రతి పోడు రైతు ధీమాగా వ్యవసాయం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని ఆయన సూచించారు.
కాంగ్రెసోళ్లు మా ఉసురు పోసుకున్నరు
సీఎం కేసీఆర్ దయతో మా భూములకు పట్టాలొచ్చినయి. 70 ఏండ్ల వయస్సులో నా కల నెరవేరడం సంతోషంగా ఉంది. నాడు కాంగ్రెసోళ్లు మా ఉసురుపోసుకున్నరు. ఫారెస్టోళ్లతో కేసులు పెట్టించిన్రు. దెబ్బలు కొట్టించిన్రు. మాకు పట్టాలిప్పిచ్చిన పెద్ద సార్ రుణం తీర్చుకుంటం. గ్రామంలో రంగాయచెర్వులో ముంపునకు గురవుతామనుకున్న మాకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శరెడ్డి సార్ అండగ ఉన్నడు. గ్రామాన్ని కాపాడడంతోపాటు పోడుపై ఆధారపడి ఆకలితో అలమటిస్తున్న మాకు నేడు సీఎం సార్ పట్టాలిచ్చి ఆదుకున్నడు.
– అజ్మీరా జమ్మీ, లచ్చితండా,నల్లబెల్లి (వరంగల్)