హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్ వరి సాగులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా నిలిచింది. ఈ విషయాన్ని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. మిగిలిన రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో వరి సాగవుతున్నట్టు పేర్కొంది. దేశంలో వరితోపాటు ఇతర పంటల సాగు వివరాలను కేంద్ర వ్యవసాయశాఖ శుక్రవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత యాసంగితో పోల్చితే వరిసాగు భారీగా పెరిగినట్టు తెలిపింది. వరిసాగు విస్తీర్ణం పెరుగుదలలో తెలంగాణ కీలకంగా నిలిచిందని పేర్కొన్నది.
దేశవ్యాప్తంగా మొత్తం వరిసాగులో తెలంగాణ వాటా 40 శాతానికిపైగా ఉండడం విశేషం. దేశం మొత్తం 46.25 లక్షల హెక్టార్లలో వరి సాగైతే ఒక్క తెలంగాణలోనే 18.07 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. 12.21 లక్షల హెక్టార్లతో తెలంగాణ తర్వాత స్థానంలో తమిళనాడు నిలిచింది. మిగతా ఏ రాష్ర్టాల్లోనూ 5 లక్షల హెక్టార్లకు మించి వరి సాగు కాలేదు. దేశవ్యాప్తంగా 2021-22లో 35.05 లక్షల హెక్టార్లలో వరి సాగైతే 2022-23లో 46.25 లక్షల హెక్టార్లకు పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది. గతంతో పోల్చితే 11.20 లక్షల హెక్టార్లలో వరి సాగు పెరుగగా, ఈ మొత్తంలో తెలంగాణ నుంచే 10.31 లక్షల హెక్టార్లు ఉండడం విశేషం. గతేడాది యాసంగిలో రాష్ట్రంలో 7.76 లక్షల హెక్టార్లలో వరి సాగు కాగా, ఈ సీజన్లో ఇది 18.07 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఇతర పంటల సాగులోనూ తెలంగాణ ముందు వరుసలో ఉందని కేంద్రం ప్రకటించింది.
నాడు యాగి.. నేడు ప్రశంస
వరి సాగు విస్తీర్ణం, దిగుబడి విషయంలో గతంలో తెలంగాణపై నిందలు వేసిన కేంద్రం ఇప్పుడు అదే నోటితో ప్రశంసించింది. 2020-21లో తెలంగాణలో రికార్డుస్థాయిలో వరి సాగు నమోదైంది. యాసంగిలో 53.78 లక్షల ఎకరాల్లో సాగు కాగా, వానాకాలంలో 52 లక్షల ఎకరాల్లో సాగైంది. అయితే, ధాన్యం కొనుగోలుకు ఇష్టంలేని కేంద్ర సర్కారు వరి సాగు విస్తీర్ణంపై నానా యాగీ చేసింది. తెలంగాణ రైతులను అవమానపరిచేలా వ్యవహరించింది. వరి సాగులో తెలంగాణ అబద్ధాలు చెప్తున్నదని నిందలు వేసింది. వరిసాగు విస్తీర్ణంపై స్వయంగా శాటిలైట్ సర్వే చేయించింది. ఈ సర్వేలోనూ తెలంగాణ ఇచ్చిన వివరాల ప్రకారమే సాగు విస్తీర్ణం రికార్డు కావడం గమనార్హం.
వరిసాగు వద్దని.. ఇప్పుడు గొప్పలు
గతేడాది యాసంగిలో దేశవ్యాప్తంగా వరి సాగు చేయొద్దని రాష్ర్టాలకు కేంద్రం హుకుం జారీ చేసింది. ఒకవేళ సాగు చేసినా తాము కొనుగోలు చేయబోమని స్పష్టం చేసింది. దీంతో చాలా మంది రైతులు వెనక్కి తగ్గారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ జాతీయస్థాయిలో కేంద్రంతో పెద్ద యుద్ధమే చేసింది. అయితే గతంలో వరి సాగు వద్దని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు అదే నోటితో వరి సాగు పెరుగుదలపై గొప్పగా ప్రకటనలు చేసుకోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ఇందుకు కారణమని చెప్పుకోవడం సిగ్గుచేటనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంచి జరిగితే వారి గొప్ప.. లేదంటే రాష్ర్టాల తప్పుగా కేంద్రం భావిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేశవ్యాప్తంగా పెరిగిన పంటల సాగు
దేశవ్యాప్తంగా గత ఏడాదితో పోల్చితే ఈ యాసంగిలో మొత్తం పంటల సాగు 3.25 శాతం పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది. 2021-22లో మొత్తం 697.98 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు కాగా, 2022-23లో 720.68 లక్షల హెక్టార్లలో సాగైనట్టు ప్రకటించింది. ఈ యాసంగిలో 22.71 లక్షల హెక్టార్ల సాగు పెరిగింది. అన్ని పంటలతో పోల్చితే వరి సాగులోనే అత్యధిక పెరుగుదల నమోదైంది. మొత్తం సాగు పెరుగుదలలో 22.71 లక్షల హెక్టార్లలో 11.20 లక్షల ఎకరాలు వరి సాగే ఉండడం విశేషం.