హైదరాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): ఆయిల్పాం సాగులో తెలంగాణ మరో ఘనత సాధించింది. ఒకే ఏడాదిలో అత్యధిక విస్తీర్ణంలో ఆయిల్పాం సాగు చేసిన రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా నిరుడు (2022-23) 82 వేల ఎకరాల్లో కొత్తగా ఆయిల్పాం సాగులోకి వచ్చింది. దేశంలో మరే రాష్ట్రంలో కూడా ఒకే ఏడాదిలో ఈ స్థాయిలో ఆయిల్పాం సాగు చేయలేదు. ఏ రాష్ట్రం కూడా ఇప్పటివరకు ఒక ఏడాదిలో నాలుగైదు వేల ఎకరాలకు మించి కొత్తగా సాగు చేయకపోవడం గమనార్హం. రాష్ట్రంలో ఆయిల్పాంను అత్యధికంగా కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సాగుచేస్తుండగా తాజాగా సిద్దిపేట, నిర్మల్, మహబూబాబాద్ జిల్లాల్లోనూ జోరందుకున్నది. ఒక్కో జిల్లాలో సుమారు ఐదారు వేల ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేస్తుండటం గమనార్హం.
రాష్ట్రంలో ఆయిల్పాం సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో ఆయిల్పాం సాగు విస్తీర్ణం 1.41 లక్షల ఎకరాలకు పెరిగింది. 2013-14 వరకు రాష్ట్రంలో కేవలం 33,571 ఎకరాల్లోనే ఆయిల్పాం సాగు అయ్యేది. ఆ తర్వాత కూడా అంతంత మాత్రంగానే పెరుగుతూ వచ్చింది. ఇందుకు కారణం సరైన నీటి వసతి లేకపోవడమే. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయతో సాగునీటి కష్టాలు తీరాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయిల్పాం సాగును ప్రోత్సహిస్తున్నది. దీంతో ఆయిల్పాం సాగు విస్తీర్ణం 2021-22లో 15,402 ఎకరాలు, 2022-23లో ఇది 82 వేల ఎకరాల చొప్పున పెరిగింది.
వచ్చే ఏడాది 2 లక్షల ఎకరాలకు పెరగనున్నది. మిషన్ ఆయిల్పాంలో భాగంగా తొలి ఏడాది అద్భుతమైన ఫలితాలు రావడంతో ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లేందుకు ఉద్యానశాఖ కసరత్తు చేస్తున్నది. ఈ ఏడాది (2023-24) రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్పాం సాగును లక్ష్యంగా నిర్దేశించుకున్నది. ఇందుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ఉద్యానశాఖ ఎదురుచూస్తున్నది. కేంద్రం నుంచి అనుమతి రాగానే క్షేత్రస్థాయిలో ఆయిల్పాం మొక్కల పంపిణీకి చర్యలు చేపట్టనున్నది. వచ్చే ఐదేండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం.
అత్యధికంగా ఆయిల్పాం సాగు చేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. సుమారు 5 లక్షల ఎకరాలతో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉన్నది. రానున్న ఐదారేండ్లలో ఆయిల్పాం సాగులో ఏపీని తెలంగాణ అధిగమించి, దేశంలోనే నంబర్ వన్గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. సబ్సిడీల రూపంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, రైతుల ఉత్సాహం, నీటి లభ్యత తదితర కారణాలు ఇందుకు దోహదం చేయనున్నాయి.