Gurukul Recruitment | హైదరాబాద్, ఏప్రిల్16(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. ఇప్పటికే తొలిదఫాగా 9,231 పోస్టులను నియమిస్తామని ప్రకటించింది. అందులోభాగంగా డిగ్రీ లెక్చరర్స్ (డీఎల్), జూనియర్ లెక్చరర్స్ (జేఎల్), ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల పూర్తిస్థాయి నోటిఫికేషన్ను సోమవారం తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) విడుదల చేయనున్నది. జోనల్, మల్టీ జోనల్ వారీగా ఉన్న పోస్టుల వివరాలతోపాటు నిర్దేశిత విద్యార్హతల వివరాలను, ఎగ్జామ్ సిలబస్ తదితర అంశాలను ప్రకటించనున్నది. ఈ పోస్టుల వన్టైమ్ రిజిస్ట్రేషన్ 12 నుంచి ప్రారంభంకాగా, సోమవారం నుంచి మే 17 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనున్నదని ట్రిబ్ ఇప్పటికే వెల్లడించింది.
ఆగస్టులో పరీక్షల నిర్వహణ
గురుకులాల్లో పోస్టుల భర్తీకి ట్రిబ్ పకడ్బందీ చర్యలు చేపట్టింది. పరీక్ష నిర్వహణకు సమగ్ర ప్రణాళికలను రూపొందించేందుకు తలమునకలైంది. ఇప్పటికే రోస్టర్ ప్రాతిపదికన పోస్టుల రిజర్వ్ ప్రక్రియను పూర్తి చేసింది. ప్రస్తుతం నోటిఫికేషన్లను కూడా ప్రణాళికాబద్ధంగా విడుదల చేస్తున్నది. తొలుత డిగ్రీ, జూనియర్ కళాశాల లెక్చరర్ పోస్టులు, ఆ తరువాత పీజీటీ, పీడీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, టీజీటీ పోస్టుల భర్తీకి ప్రణాళికలను రూపొందించింది. అంతేకాదు, ఆయా పరీక్షలను ఎప్పుడు నిర్వహించాలనే అంశంపైనా కూడా ట్రిబ్ ముమ్మర సన్నాహలు చేస్తున్నది. దరఖాస్తుల స్వీకరణ ముగిసినప్పటి నుంచి రెండు నెలల సమయమివ్వాలని ప్రాథమికంగా నిర్ణయించింది. మొత్తం మీద ఆగస్టు నుంచి పరీక్షల నిర్వహణకు ట్రిబ్ దృష్టిసారించింది.