హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 : హైదరాబాద్లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) దవాఖాన సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలందిస్తున్నది. ఆరోగ్య రంగంలో తెలంగాణను అగ్రభాగాన నిలుపుతున్నది. ఢిల్లీలోని ఎయిమ్స్కు దీటుగా అన్ని రకాల వైద్యసేవలందిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్నది. తెలంగాణ ఏర్పడకముందు సాధారణ స్థాయిలో వైద్య సేవలందించిన నిమ్స్ నేడు అవయవ మార్పిడుల వరకు అధునాతన సేవలందిస్తున్నది. సీఎం కేసీఆర్ ఆరోగ్యరంగానికి పెద్దపీట వేసిన నేపథ్యంలో నిమ్స్ను అన్ని రకాలుగా తీర్చిదిద్దారు. గత ఏడేండ్లలో కొత్తగా 589 పడకలను చేర్చారు. ప్రస్తుతం 1,489 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. కొత్తగా 2020లో మాలిక్యులర్ డయాగ్నస్టిక్ ల్యాబ్ను, 2021లో న్యుమటిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. గత ఏడేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 90 కోట్ల విలువైన అత్యాధునిక వైద్యపరికరాలను నిమ్స్కు సమకూర్చింది. రాష్ట్రం ఏర్పడక ముందు ఏడాదికి 24,931 మందికి ఇన్పేషెంట్లుగా చికిత్సనందించగా ఇప్పుడు సగటున 47 వేల మందికిపైగా సేవలు పొందుతున్నారు. వైద్యసేవల ప్రమాణాలు పెరగడంతో దవాఖానకు వచ్చే రోగులసంఖ్య కూడా భారీగా పెరిగింది. ఔట్పేషెంట్ విభాగంలో ఇప్పుడు ఏడాదికి సగటున ఆరు లక్షల మంది చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్సల పరంగా కూడా నిమ్స్లో పూర్తిస్థాయిలో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఏటా 24వేలకు పైగా ఆపరేషన్లు జరుగుతున్నాయి.
నిరుపేదలకు ఉచితంగా అవయవ మార్పిడి
అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు ఖరీదైనవి కావడంతో నిరుపేదలకు అందని ద్రాక్షగా ఉండేది. సీఎం కేసీఆర్ అవయవ మార్పిడిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడంతో నిరుపేద రోగులకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగాను ఎంతో ఉపశమనం కలిగింది. తెలంగాణ ఏర్పడిన తరువాత 17 కాలేయ మార్పిడి, ఆరు గుండె మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. వీటితోపాటు కిడ్నీ, బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్ తదితర శస్త్రచికిత్సల సంఖ్య పెరిగింది. తెలంగాణ ఏర్పడిన తరువాత దేశంలోనే తొలిసారిగా దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అమర్చే ప్రక్రియను నిమ్స్లో ప్రారంభించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు 142 మంది రోగులకు 155 అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ లింబ్స్ను సీఎంఆర్ఎఫ్ కింద అమర్చారు. గతంలో కార్డియాక్ ప్రొసీజర్ చికిత్స నిమ్స్లో లేదు. ఇటీవల ట్రాన్స్ ఎరోటిక్ వాల్వులర్ ఇంప్లాంటేషన్ (టీఏవీఐ)ని ప్రారంభించారు. గత ఏడేండ్లలో మూత్రపిండ బాధితులకు డయాలిసిస్ సెషన్స్ సంఖ్య కూడా భారీగా పెరిగింది. దేశంలోనే నిమ్స్ టాప్ డయాలిసిస్ సెంటర్గా గుర్తింపు పొందింది.
పెరిగిన పరిశోధనలు, సిబ్బంది
నిమ్స్లో రాష్ట్రం ఏర్పాటుకు ముందు వైద్యశాస్ర్తానికి సంబంధించి 20 పరిశోధనలు జరిగితే గత ఏడేండ్లలో 61 పరిశోధనలు జరిగాయి. ఇక సిబ్బంది సంఖ్య కూడా అవసరాలకు అనుగుణంగా గణనీయంగా పెరిగింది. ఫ్యాకల్టీతోపాటు రెసిడెంట్ డాక్టర్ల సంఖ్య గత ఏడేండ్లలో దాదాపు రెట్టింపయ్యింది.
కొత్తగా ఐదు సూపర్స్పెషాల్టీ విభాగాలు
అత్యంత ఖరీదైన వైద్యం అందించే ఐదు సూపర్ స్పెషాలిటీ విభాగాలను రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్లో అందుబాటులోకి తెచ్చింది. అవి ఎమర్జెన్సీ మెడిసిన్, క్లినికల్ హెమటాలజీ, సబ్ స్పెషాలిటీస్, జెరియాట్రిక్ మెడిసిన్, స్టెమ్సెల్ రిసెర్చ్ సెంటర్. దవాఖానలోని ఐదు విభాగాలను రాష్ట్ర ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దింది. అవి 1.జాయింట్ రీప్లేస్మెంట్, 2.డిసిగ్నేటడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ రేర్ డిసీజెస్ 3. దేశంలోనే నాలుగవ మెడికల్ జెనటిక్స్ సెంటర్ 4. జెరియాట్రిక్ మెడిసిన్ 5. క్లినికల్ ఫార్మకాలజీ అండ్ థెరప్యూటిక్స్. ఇంకా డీబీఎస్ సర్జరీస్, బ్రాకియల్ ఫ్లెక్సస్ సర్జరీస్, స్పైన్ సర్జరీస్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ దవాఖానల్లోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్లో పెట్ సీటీ స్కాన్ను సమకూర్చింది. దీంతోపాటు టెలీమెడిసిన్, ఈ-ఐసీయూ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.