హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వ బడులు లేని పల్లెలు, ఆవాసాల్లో ఉంటూ చదువుకొంటున్న విద్యార్థులకు రవాణాభత్యాన్ని ఇచ్చేందుకు సమగ్రశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాష్ట్రంలోని 3,882 కుగ్రామాల్లో 37,103 మంది విద్యార్థులను ఇందుకు అర్హులుగా గుర్తించారు. వీరికి తమ గ్రామాల్లో బడుల్లేవు. సమీప గ్రామాలకు ఆటోలు, వ్యాన్ల ద్వారా వెళ్లి అక్కడి ప్రభుత్వ బడుల్లో చదువుకొంటున్నారు.
విద్యాహక్కు చట్టం ప్రకారం వీరికి రవాణాభత్యాన్ని ఇవ్వాలి. 1నుంచి 5వ తరగతి వరకు ఒక కిలోమీటరు, 8వ తరగతి వరకు 3 కిలోమీటర్లు, 9, 10 తరగతులకు 5 కిలోమీటర్ల దూరంలోని స్కూళ్లల్లో చదువుకొంటే రవాణాభత్యం ఇవ్వాలి. వీరికి నెల రూ. 600 చొప్పున రవాణా భత్యాన్ని అందజేయాలి.