హైదరాబాద్, మార్చి 10 : రైతు బీమా తరహాలోనే లక్షమందికి చేనేత బీమాను ప్రారంభిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. దీనికోసం బడ్జెట్లో రూ.50 కోట్లు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలపై మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ వివరణ ఆయన మాటల్లోనే…
10 స్పెషల్ ఫుడ్ప్రాసెస్ యూనిట్లు
మొదటి దశలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లుగా కొన్ని ఏరియాలను, 91 స్థలాలను గుర్తించాం. మొదటి దశలో 14 నిర్మించబోతున్నాం. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం మొగలాపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బూద కలాన్, నిర్మల్ జిల్లా బాసర, వనపర్తి జిల్లా కంబాలపూర్ మండలం శ్రీరంగాపురం, నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కందన్పల్లి, మహబూబ్నగర్ జిల్లా హన్వాడ, నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం సర్వారెడ్డిపల్లి, సిద్దిపేట జిల్లా వర్గల్, మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘన్పూర్, సంగారెడ్డి జిల్లా మునిపల్లి, కోహిర్ మండలాల మధ్య వెంకటాపూర్ దగ్గర, నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఆళ్లగడప, వికారాబాద్ జిల్లా నవాబ్పేట, ఆర్కతల దగ్గర ఒక్కొక్కటి ప్రారంభించబోతున్నాం. హైదరాబాద్ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్గా ఎదిగింది. స్థలం సరిపోవడం లేదు. ఇంకో 250 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీని కూడా విస్తరిస్తాం. కొత్తగా బయోటెక్ కంపెనీలు చాలా వస్తున్నయ్. అందరికీ కావాల్సినంత స్థలమిస్తాం. ప్రోత్సహిస్తం.
శుష్కప్రియాలు.. శూన్యహస్తాలు
కరోనా వచ్చి రెండేండ్లు బాగా ఇబ్బంది పడ్డాం. అలిండియా డివైజస్ మెడికల్ మాన్యుఫ్యాక్చర్ సమావేశం పెట్టాం. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా సుల్తాన్పుర్లో మెడికల్ డివైజస్ పార్కు పెట్టినం. పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించినం. ఇన్వెస్ట్మెంట్ పెట్టండి.. మా పిల్లలకు కొలువులోస్తాయని, రాష్ర్టానికి ఆదాయం వస్తుందని విజ్ఞప్తి చేసినం. ఇద్దరు పారిశ్రామిక వేత్తలు నా ముఖం మీదే కుండబద్ధలు కొట్టి చెప్పారు. మాస్కులు, గ్లౌజులు చైనా నుంచి ఉత్పత్తి చేసుకుంటే ఇక్కడ తయారు చేసినదానికంటే తక్కువకు వస్తున్నయ్ అని. అట్లెట్ల వస్తయని నేను అడిగిన. మన కేంద్రం రూల్స్ అట్ల ఉన్నయ్ అని చెప్పారు. మన ఇంపోర్ట్ డ్యూటీస్ అంత వికారంగా ఉన్నయ్. శుష్కప్రియాలు, శూన్యహస్తాలు అన్నట్టు ఉంటది మన కేంద్రం విధానం.
సబ్కా సాథ్.. సబ్కా వికాస్ అంటే ఇదేనా?
వరంగల్లో 1250 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పెట్టినం. ఇప్పటికి అందులో రెండు ప్రముఖ దిగ్గజ సంస్థలు.ఒకటి యంగ్వన్ అని కొరియాది, మరొకటి కిటెక్స్ అని కేరళ సంస్థలు వచ్చాయి. దీనికోసం కేంద్రాన్ని సహాయం అడిగినం. అయ్యా మీరు చైనాతో పోటీ పడుతున్నం అంటున్నరు కదా.. మా జౌళిపార్కుకు సాయం చేయండి అని. తెలంగాణ కూడా భారతదేశంలో అంతర్భాగమే కదా.. మా పార్కుతో ప్రపంచంలో దేశానికి గౌరవం పెరుగతదని కోరినం. కానీ పైసా ఇవ్వలే. వరంగల్లోనే కాదు. సిరిసిల్లలో గద్వాలలో హ్యాండ్లూమ్ పార్కు, నారాయణపేటలో ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నం. హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ మంత్రిగా గర్వంగా చెప్తున్నా. చేనేత కార్మికుల కోసం ఈ ప్రభుత్వం చేసినంతగా ఎవరూ చేయలేదు.
ప్రైవేటులో 95 శాతం.. అర్థరహితం!
95 శాతం ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు తీసుకురావాలని విపక్షం కోరుతున్నది. కఠోరమైన వాస్తవం ఏంటంటే.. ఇవాళ పోటీ రెండు రాష్ర్టాల మధ్య లేదు. తెలంగాణలో 95 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని యాపిల్ వంటి సంస్థకు చెప్తే.. వాళ్లు తెలంగాణకు వస్తారా? వెళ్లి వేరే రాష్ట్రంలో పెట్టుకుంటరు. స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్లో తెలంగాణలో వాళ్లు మందువరుసలో ఉంటున్నరు. విదేశాల్లో ఎంతోమంది పనిచేస్తున్నరు. బెంగుళూరులో ఐటీలో 40 శాతం మంది తెలంగాణ వాళ్లే ఉన్నరు. అన్నిచోట్ల అట్లాంటి రూల్స్ పెడితే మనోళ్ల పరిస్థితి ఏంటి? అయినప్పటికీ కొత్త పాలసీ ప్రవేశపెట్టినం. జనవరి 11న జీవో తీసుకొచ్చినం. టీ ఐడియా, టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలు పెడితే రాయితీలు యథావిధిగా ఇస్తం. తెలంగాణ వాళ్లకు ఉద్యోగాలు ఇస్తే కొన్ని మినహాయింపులు ఇస్తం. 70 శాతం ఉపాధి తెలంగాణ వాళ్లకు ఇస్తే మీకు అదనపు రాయితీలు ఇస్తమని చెప్పినం. క్యాటగిరీ 1లో 20 శాతం స్కిల్డ్ మ్యాన్పవర్, 50 శాతం స్కిల్డ్ మ్యాన్పవర్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్ ఇస్తే 5 శాతం కాపిటల్ సబ్సిడీ అదనంగా ఇస్తాం. ఎస్జీఎస్టీలో కూడా ఇంకో 10 శాతం అదనంగా రాయితీ ఇస్తాం. పవర్లో కూడా ఇంకో 75 పైసలు అదనంగా ఇస్తాం. క్యాటగిరీ 2లో 80 శాతం సెమీ స్కిల్డ్, 60 శాతం స్కిల్డ్ మనవాళ్లకే ఇస్తే.. 10 శాతం క్యాపిటల్ సబ్సిడీ ఇస్తామని చెప్పాం. ఈ రకంగా పాజిటివ్ పాలసీ తీసుకొచ్చి మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నం. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పేరుతో దేశంలోని ఏ ప్రభుత్వమూ చేయని విధంగా ప్రవేశపెట్టినం. గత నాలుగేండ్లుగా 334 యూనిట్లకు ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ద్వారా పరిష్కరించినం. వారిని కాపాడినం. చిన్న పారిశ్రామికవేత్తలకు కరోనా వల్ల తగిన సాయం చేయలేకపోయినం. కానీ ఈ బడ్జెట్లో రూ.2,500 కోట్ల రాయితీలు ఇచ్చినం. ఓల్డ్ సిటీలో కూడా పరిశ్రమలు నెలుకొల్పుతాం. టీఎస్ ఐపాస్లో భాగంగా దళిత, గిరిజన పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి టీ ప్రైడ్ ఉన్నది. ఇప్పటివరకు 24,287 దళిత పారిశ్రామికవేత్తలకు రూ.1,194 కోట్లు రాయితీలు చెల్లించాం. 24,604 మంది గిరిజన పారిశ్రామిక వేత్తలకోసం రూ.1,121 కోట్లు రాయితీ ఇచ్చాం. ప్రతి పారిశ్రామికపార్కులో 10% ప్లాట్లను మహిళల కోసమే రిజర్వు చేస్తున్నాం. అంగవైకల్యం ఉన్నవారికి ప్రత్యేక రాయితీ ఇస్తున్నాం. బిల్ట్ పరిశ్రమను తెరిపించేందుకు ప్రయత్నం చేస్తున్నాం.
ఏది పడితే అది మాట్లాడొచ్చా? ఇదేం నీతి?
ముచ్చింతల్లో ఫార్మాసిటీ కోసం భూమిని సేకరిస్తున్నాం.. దాదాపుగా చివరిదశకు వచ్చింది. ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ఉంటున్నాయి. ఇదెంత దుర్మార్గం. రైతుల దగ్గర రూ.10 లక్షలకు కొని రూ.2 కోట్లకు అమ్ముకొంటున్నదని ఆరోపిస్తున్నారు. ఇంతవరకూ గుంట భూమి కూడా ఎవరికీ ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాత్రం కోట్ల రూపాయలకు ప్రభుత్వం అమ్ముతుందని ఇష్టమొచ్చినట్టు స్టేట్మెంట్ ఇస్తున్నడు. ఇదేంనీతి? ప్రగతి పథంలో ముందుకు పోతామంటే సహకరించకుండా, మంచిమాటలు చెప్పకుండా ఇదేం రకమైన రాజకీయమో మాకైతే అర్థం కావడం లేదు. ఈ బాధతోనే నేనొక మాట అంటే సభలో లేని సభ్యుడి గురించి ఎట్ల మాట్లడతరని భట్టి విక్రమార్క అంటున్నడు. ఇదేం రాజకీయ వేదిక కాదని భట్టి అన్నరు మంచిదే. కానీ.. రాజకీయ వేదిక మీద ఏది పడితే అది మాట్లాడొచ్చా? నోటికి ఎంతొస్తే అంత అనొచ్చా? మన రాష్ర్టాన్ని మనమే నిందలపాలు చేసి, పదిమంది ముందు నవ్వులపాలు చేస్తే దానివల్ల వచ్చేదేం లేదు. తెలంగాణలో ఏమైనా మంచి చేద్దామంటే కేంద్రం సాయం చేయదు. రాష్ర్టానికి మంచి జరుగుతుందని కాంగ్రెస్ సహకరించదు. కాంగ్రెస్ వాళ్లకు కాలుష్యం మీద అనుమానాలు ఉన్నయ్. ఫార్మాలో కాలుష్యం ఒకప్పటి మాట.. ఇప్పుడు జీరో లిక్విడ్ డిశ్చార్జి వచ్చింది. ట్రీట్మెంట్ ప్లాంట్లు వచ్చినయ్. రకరకాల కొత్త టెక్నాలజీలు వచ్చినయ్. కాలుష్యం లేకుండానే ప్రపంచంలోనే అద్భుతమైన ఫార్మాసిటీ కడతాం అంటే కాంగ్రెస్, బీజీపీకి దురద ఎందుకో అర్థం కావట్లేదు. ఇది ఏ రకమైన నీతి? ప్రగతిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో బ్రహ్మాండంగా 14 ప్రాధాన్య రంగాలు ఎంచుకున్నం. వాటిని ప్రగతి పథంలోకీ తీసుకెళ్తం.