రవీంద్ర భారతి, మే 8: సగర కులస్థుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సగరులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సగర సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి గంగుల, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సగర కులస్థుల కులదైవం భగీరథ మహర్షి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని అన్నారు.
భగీరథుని పేరు మీదు మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని చెప్పారు. గత 70 ఏండ్లలో ఏ సర్కారు కూడా కుల సంఘాల నాయకుల జయంతులు, వర్ధంతులు నిర్వహించలేదని, సీఎం కేసీఆర్ దూరదృష్టితో అన్ని కులాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడించారు. ప్రతి కులం ఆత్మగౌరవాన్ని చాటేలా హైదరాబాద్లో 2 ఎకరాల చొప్పున ఆత్మగౌరవ భవనాలకు భూమిని కేటాయించి, నిధులు ఇచ్చామని తెలిపారు. వెనుకబడిన కులాల పిల్లలు విదేశాల్లో చదువుకోవటానికి రూ.20 లక్షలు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. వకుళాభరణం కృష్ణమోహన్రావు మాట్లాడుతూ దేశ జనాభాలో 70 శాతం ఉన్న బీసీల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని కొనియాడారు. బీసీలు రాజ్యాధికారమే ధ్యేయంగా పనిచేయాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీల జనగణన నిర్వహించి, జనాభా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సగర కులస్థులు చట్టసభల్లో ఉంటే వారి హక్కుల కోసం పోరాడవచ్చని అన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు కే కిశోర్గౌడ్, సీహెచ్ ఉపేందర్, జాజల శ్రీనివాస్గౌడ్, పూలే సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంగెం సూర్యారావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, సగర సంఘానికి చెందిన ఉప్పరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.