హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): జిల్లా దవాఖానల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణ పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లా దవాఖానల్లో రూ.34.38 కోట్లతో నిర్మాణాలు చేపట్టేందుకు పరిపాలనా అనుమతులు ఇస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
సిరిసిల్ల జిల్లా దవాఖానలో 3వ అంతస్థు నిర్మాణానికి రూ.6.80 కోట్లు, కామారెడ్డి జిల్లా దవాఖానలోని పాత టీబీ బ్లాక్లో మూడో అంతస్థు, అదనపు వార్డుల నిర్మాణానికి రూ.8కోట్లు, ఖమ్మంలోని కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ప్రస్తుత భవనాల ఆధునీకరణకు రూ.8.05 కోట్లు, కరీంనగర్లోని భవన మరమ్మతులకు రూ.7 కోట్లు కేటాయించింది. సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్న క్రమంలో గత ఏడాది 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.