హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు బడుల్లో టీచర్ పోస్టుల భర్తీకి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11,062 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్రెడ్డి డీఎస్సీ2024 నోటిఫికేషన్ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి విడుదల చేశారు.
వీటిలో 6,508 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులుండగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629, భాషాపండితులు 727, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ)182 పోస్టులున్నాయి. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల్లో 220 స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులుండగా, 796 సెకండరీ గ్రేడ్ టీచర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులున్నాయి. అభ్యర్థులు ఈ నెల 4 నుంచి ఏప్రిల్ 3 వరకు డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకొనే వారు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపు గడువు ఏప్రిల్ 2న ముగియనున్నది. వివరాలకు https: //schooledu. telangana వెబ్సైట్ను సంప్రదించాలి. కార్యక్రమంలో సీఎంవో సెక్రటరీ మాణిక్రాజ్ కన్నన్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తదితరులు ఉన్నారు.
సీబీటీ పద్ధతిలో పరీక్షలు..
డీఎస్సీ రాత పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో 11 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి కేంద్రాల్లో పరీక్షలు ఉంటాయి. జూన్, జూలైల్లో పరీక్షలను నిర్వహించే అవకాశం ఉన్నది. పార్లమెంట్ ఎన్నికలు, ఎప్సెట్, జేఈఈ, నీట్ వంటి పరీక్షల దృష్ట్యా పరీక్షలు ఆలస్యం కానున్నాయి.
నిరుడు 5,089 పోస్టుల భర్తీకి కేసీఆర్ సర్కారు డీఎస్సీ నోటిఫికేషన్ను జారీచేసిన విషయం తెలిసిందే. దాన్ని రద్దుచేసి కొత్తగా నోటిఫికేషన్ను జారీచేయగా, అప్పట్లో దరఖాస్తు చేసినవారు తాజాగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ సారి మహిళలకు సమాంతర రిజర్వేషన్ల వర్తింపుతో డీఎస్సీకి దరఖాస్తుల సంఖ్య పెరగనున్నది. మరో 2 లక్షల దరఖాస్తులొస్తాయని అధికారులు అంచనా వేశారు. జిల్లాల వారీగా పోస్టుల వివరాలను మార్చి 4న విడుదల చేస్తారు.డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించడం పట్ల పీఆర్టీయూ టీఎస్ సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది.
సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు : పీఆర్టీయూ టీఎస్
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించడం పట్ల పీఆర్టీయూ టీఎస్ హర్షం వ్యక్తంచేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. దీర్ఘకాలికంగా బడుల్లో సబ్జెక్టు టీచర్ల కొరతతో విద్యాప్రమాణాలు దెబ్బతింటున్నాయని, ఈ డీఎస్సీ నోటిఫికేషన్తో విద్యారంగం మరింత బలోపేతమవుతుందని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధానకార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు అభిప్రాయపడ్డారు. టెట్ మినహాయింపు కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని వారు సీఎంకు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్లో అత్యధికం.. పెద్దపల్లిల్లో అత్యల్పం
రాష్ట్రప్రభుత్వం భర్తీచేసే టీచర్ పోస్టుల్లో అత్యధికం హైదరాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. అత్యధికంగా ఈ జిల్లాలోనే 878 పోస్టులున్నాయి. వీటిలో 537 పోస్టులు ఎస్జీటీలే ఉండటం విశేషం. నల్లగొండలో 605, నిజామాబాద్లో 601 చొప్పున పోస్టులున్నాయి. అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 93 పోస్టులే ఉన్నాయి. ఈ పోస్టుల్లో 49 స్కూల్ అసిస్టెంట్ పోస్టులుండగా, 21 ఎస్జీటీలున్నాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తున్నది. మొత్తం 1,016 పోస్టులను భర్తీ చేస్తుండగా, ఇవి నల్లగొండలో 60, రంగారెడ్డిలో 56, నాగర్కర్నూలులో 54 చొప్పున పోస్టులున్నాయి. వీటిని బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అర్హత ఉన్నవారితో భర్తీ చేస్తారు.