హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తాగునీటి పేరుతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే కృష్ణా జలాలను పరిమితికి మించి వాడుకున్నదని, మరోవైపు పెన్నాలోని రిజర్వ్ స్టోరేజీలను సాగునీటికి వినియోగిస్తున్నదని, ఈ నేపథ్యంలో ఏపీ తాజాగా చేసిన ప్రతిపాదనలను ఎట్టిపరిస్థితుల్లోనూ పరిశీలించవద్దని తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ శుక్రవారం లేఖ రాశారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ల నుంచి నిరుటి కేటాయింపులకు మించి 51.74 టీఎంసీలను ఏపీ అధికంగా వినియోగించుకున్నదని పేర్కొన్నారు. ఈ నీటి సంవత్సరంలో 6 టీఎంసీలే వినియోగించుకోవాల్సి ఉన్నా ఇప్పటికే 40 టీఎంసీలను వినియోగించుకున్నదని వెల్లడించారు. అదీగాక కృష్ణా నుంచి పోతిరెడ్డిపాడు, హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మళ్లించి.. పెన్నా బేసిన్లోని రిజర్వాయర్లలో నిల్వ చేసిన జలాలను సాగునీటి కోసం వినియోగిస్తున్నదని అభ్యంతరం తెలిపారు. ఇప్పటికీ పెన్నా బేసిన్లోని రిజర్వాయర్లలో 100 టీఎంసీల మేరకు నీటి నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. అయినా తాగునీటి పేరుతో మళ్లీ ఏపీ ఇండెంట్ సమర్పించిందని ఆరోపించారు. ఇప్పటికే పరిమితికి మించి జలాలను వినియోగించుకున్న నేపథ్యంలో ఏపీ ప్రతిపాదనలు పరిశీలించవద్దని స్పష్టం చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి నీటిని మళ్లించకుండా ఏపీని నిలువరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా భవిష్యత్తు అవసరాలకు నాగార్జునసాగర్లో తెలంగాణ గత నీటిసంవత్సరానికి సంబంధించి 18 టీఎంసీలను నిల్వ చేసుకున్నదని ఈ సందర్భంగా గుర్తుచేసింది.