గ్రామీణ సమస్యలు తీర్చడంలో యువతను భాగస్వామిని చేయాలనే యోచనతో తెలంగాణ ప్రభుత్వం కొత్త యోచనకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ స్టేట్ ఇన్నొవేషన్ సెల్, యూనిసెఫ్ ఇండియా, ఇంక్విలాబ్ ఫౌండేషన్, యువా (Yuwaah) కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. సమాజంలో అత్యంత కింది స్థాయిలో వచ్చే సమస్యలకు మానవ కేంద్రీయ డిజైన్ ద్వారా పరిష్కారాలు కనుగొనడంతోపాటు, యువతలో ఆంత్రప్రెన్యూర్ మైండ్సెట్ను అభివృద్ధి చేయడం కోసం ఈ సంస్థలన్నీ కలిసి ‘‘యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్’’ కార్యక్రమాన్ని ప్రారంభించాయి.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, విద్యాశాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల చీఫ్ ఫీల్డ్ ఆఫీసర్ మెయిటల్ రస్డియా పాల్గొన్నారు. వీరంతా కలిసి ‘‘యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్’’ పోస్టర్ లాంచ్ చేశారు. అనంతరం టెక్నికల్, డిగ్రీ కాలేజి విద్యార్థులంతా కొత్త కొత్త ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐసీ, యూనిసెఫ్ ఇండియా, ఇంక్విలాబ్ ఫౌండేషన్, యువా సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ.. ‘‘కాలేజ్ యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. ఈ క్రమంలోనే ఒక పద్ధతి ప్రకారం యువత సాధికారత కోసం తెచ్చిన మరో యూచనే యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ కూడా. గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలకు హ్యూమన్ సెంట్రిక్ (మానవ కేంద్రీయ) పరిష్కారాలు చూపడం ద్వారా యువతలో కొత్త ఆలోచనలు చేసే సామర్థ్యం పెరుగుతుంది. విద్యార్థుల ఎదుగుదల, వారిలో కొత్త ఆలోచనలు చేసే సామర్ధ్యాన్ని పెంచడంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. యూనిసెఫ్ ఇండియా మాతో చేతులు కలిపడమే దానికి నిదర్శనం’’ అని అన్నారు.