హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): అసమానతలపై ఎలా పోరాడాలో, తెలంగాణ కలలను ఎలా నిజం చేసుకోవాలో, లక్ష్యాలను ఏ విధంగా సాధించుకోవాలో తమకు తెలుసునని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ స్పూర్తిని, కీర్తిని ఆపలేదని స్పష్టంచేశారు. కేంద్రం తెలంగాణపై అనేక అంశాల్లో వివక్ష చూపిస్తున్నదని విమర్శించారు. బల్క్ డ్రగ్ పార్కు సహా అనేక అంశాల విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ట్వీట్పై కేటీఆర్ స్పందిస్తూ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మూడు ఉద్యోగాల్లో ఒక్కటి ఇక్కడి నుంచే
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్ ఐటీఐఆర్ను రద్దు చేసిందని, అయినప్పటికీ తెలంగాణ గత ఎనిమిదేండ్లలో ఐటీ ఉత్పత్తులను 3.2 రెట్లు పెంచిందని, గత సంవత్సరం 15 శాతం సీఏజీఆర్ వృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐటీ రంగంలో దేశంలో కొత్తగా సృష్టించే ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్లో సృష్టించామని చెప్పారు. నిధులను సకాలంలో విడుదల చేయకుండా కేంద్రం తెలంగాణను ఇబ్బందులకు గురిచేస్తున్నదని, రాష్ట్ర రుణాలపై ఎఫ్ఆర్బీఎం పరిమితులు విధించారని తెలిపారు. దేశ జనాభాలో తెలంగాణ వంతు కేవలం 2.5 శాతం మాత్రమే అయినప్పటికీ దేశ జీడీపీలో ఐదుశాతం తెలంగాణ నుంచే అందుతున్నదని ఆయన గుర్తు చేశారు. గత ఎనిమిది సంవత్సరాలలో తలసరి ఆదాయాన్ని రెట్టింపు కంటే ఎకువ పెంచామని, ఇది భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రం కంటే ఎక్కువ అని తెలిపారు.
ఫార్మా సిటీని నిర్మిస్తాం
కేంద్రం తెలంగాణకు పారిశ్రామిక కారిడార్లను మంజూరు చేయడానికి నిరాకరించినా కూడా రాష్ట్రంలో పరిశ్రమల వృద్ధి అసాధారణంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. కొత్తగా 16 లక్షల ఉద్యోగాలను సృష్టించామని, 20 వేల కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణకు బల్ డ్రగ్ పార్ మంజూరు చేయలేదని, అయినప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా సిటీని నిర్మించి చూపిస్తామని కేటీఆర్ స్పష్టంచేశారు. కేంద్రం మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వడానికి నిరాకరించిందని అంటూ.. కేంద్ర ప్రభుత్వ అమృత్ సరోవర్ కార్యక్రమానికి తెలంగాణ పునరుద్ధరించిన 20 వేల చెరువులు ప్రేరణగా నిలిచాయని తెలిపారు. కేంద్రం ఒక మెడికల్ కాలేజీని మంజూరు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 33 వైద్య కళాశాలలను నిర్మిస్తున్నదని అన్నారు. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులకు ‘జాతీయ ప్రాజెక్టు’ హోదా ఇవ్వడానికి కేంద్రం నిరాకరించిందని, అయినప్పటికీ కాళేశ్వరంలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తమ ప్రభుత్వం సొంతంగా పూర్తి చేసిందని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ మద్దతు లేకుండా పెండింగ్లో ఉన్న అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను కూడా తెలంగాణ పూర్తి చేస్తుందని స్పష్టంచేశారు. మిషన్ భగీరథకు సహకారం అందించడానికి కేంద్రం నిరాకరించిందని, అయినప్పటికీ దేశంలో ప్రతి ఇంటికి శుద్ధి చేసిన నీటిని అందించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు.