హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు కసరత్తు ప్రారంభించింది. ఈ సీజన్లో బాయిల్డ్ రైస్ తీసుకోవాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించింది. గత సీజన్లో బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు కేంద్రం నిరాకరించింది. ఈ సీజన్లోనూ అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నది.
యాసంగిలో రా రైస్ ఇవ్వడం సాధ్యం కాదని, బాయిల్డ్ రైస్ తీసుకోవాలని కేంద్రాన్ని కోరనున్నది. మార్చి ఒకటిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో రాష్ట్ర బృందం ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ మంత్రితోపాటు ఎఫ్సీఐ ఉన్నతాధికారులతో భేటీ కానున్నట్టు తెలిసింది. అంతకంటే ముందు ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్తో అధికారులు భేటీ అయ్యే అవకాశమున్నది. ఇప్పటికే 51 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. సుమారుగా కోటిన్నర టన్నుల ధాన్యం వచ్చే చాన్స్ ఉన్నది.