Telangana Budget | సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి రంగంలో తీరని అన్యాయం జరిగింది అని మంత్రి హరీశ్రావు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. బావులు, బోర్లే దిక్కయిపోయిన రైతాంగం అప్పుల బాధలతో ఆత్మహత్యల పాలయింది. పాడుబడిన ఇండ్లు, బీడుపడిన పొలాలతో తెలంగాణ బిక్కచచ్చిపోయింది. నేడు స్వరాష్ట్రంలో తెలంగాణ సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని తలపిస్తున్నది అని హరీశ్రావు స్పష్టం చేశారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామల మాగాణంగా సాక్షాత్కరిస్తున్నది. అన్నపూర్ణగా అవతరించి, దేశానికే అన్నం పెడుతున్నది అని తెలిపారు.
వేసవిలో సైతం మత్తడి దుంకుతూ అలుగెల్లుతున్న చెరువులూ, ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా రిజర్వాయర్లకు చేరుతున్న నదీజలాలూ సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాయని హరీశ్రావు పేర్కొన్నారు.
మిషన్ కాకతీయ పథకంతో చెరువులు బాగు పడటంతో నీటి నిల్వ సామర్థ్యం బాగా పెరిగింది. ప్రాజెక్టులతో అనుసంధానం చేయడంతో వేసవిలో సైతం చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. భూగర్భ జల మట్టం పెరిగింది. 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పొందింది అని పేర్కొన్నారు.
కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల తదితర పెండింగ్ ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా పూర్తిచేసింది. దీంతో 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి అయింది. కరవు పీడిత ప్రాంతంగా, వలసల జిల్లాగా పేరుపడ్డ ఉమ్మడి పాలమూరు జిల్లా నేడు పచ్చని పంటలకు నెలవయింది. పాలమూరులో దొరికే వ్యవసాయ పనులకోసం ఇతర రాష్ట్రాల రైతుకూలీలు వలసలు వస్తున్నారంటే పరిస్థితిలో వచ్చిన మార్పును అర్ధం చేసుకోవచ్చు అని హరీశ్రావు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,825 కోట్లతో 1200 చెక్ డ్యామ్ ల నిర్మాణం చేపట్టింది. వీటిలో మొదటి దశ 650 చెక్ డ్యాంల నిర్మాణం పూర్తయింది. మిగతా చెక్ డ్యాముల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.
ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సంపూర్ణంగా సస్యశ్యామలం చేసేవిధంగా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తున్నది అని హరీశ్రావు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం దాదాపు 60 శాతం పూర్తయింది. ఈ దశలో కొన్ని ప్రతీపశక్తులూ కుట్రపూరితంగా కేసులు వేస్తూ అడ్డుకొంటున్నాయి. త్వరలోనే పర్యావరణ అనుమతులను సాధించి శరవేగంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం కంకణబద్ధమై ఉన్నది అని మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని పేర్కొన్నారు.
నేడు రాష్ట్రంలో మొత్తంగా 73 లక్షల 33 వేల ఎకరాలకు సాగునీటి వసతి ఏర్పడింది. రానున్న రెండు మూడేళ్లలో మరో 50 లక్షల 24 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. కోటికి పైగా ఎకరాల ఆయకట్టును సృష్టించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం సంపూర్ణంగా సాకారం అవుతుందన్నారు హరీశ్రావు. నీటిపారుదల రంగానికి బడ్జెట్లో రూ.26,885 కోట్లు ప్రతిపాదించడమైనదని హరీశ్రావు పేర్కొన్నారు.