హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. సర్పంచ్ నుంచి మంత్రి వరకు ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్టు తెలిపారు. ప్రగతిభవన్లో ఆదివారం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా సైక్లోన్ ఎఫెక్ట్ ఉన్నదని, నాలుగైదు రోజులు రాష్ట్రవ్యాప్తంగా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పారు.
అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఇప్పటికే అప్రమత్తం చేశామని తెలిపారు. గోదావరిలో సమ్మక్క బరాజ్ వద్ద 9.10 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నదని చెప్పారు. ఎస్సారెస్పీకి భారీగా వరద వస్తున్నదని తెలిపారు. మంగపేట, ఏటూరునాగారం, రామన్నగూడెం ప్రాంతాల్లో ప్రమాదం పొంచి ఉన్నదని, అక్కడి అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కొత్తగూడెం, నిజామాబాద్ పంపించామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్లతోపాటు ఎయిర్ఫోర్స్తో మాట్లాడి మరో రెండు, మూడు హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచామని చెప్పారు. బుధవారం వరకు విద్యాసంస్థలు మూసివేశామని తెలిపారు.
వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలని కేసీఆర్ సూచించారు. రోడ్లు, కల్వర్టుల మీద నుంచి నీరు ప్రవహిస్తుంటే దుస్సాహసం చేసి ఎవరూ దాటొద్దన్నారు. వర్షాలకు కూలే ప్రమాదం ఉండటంతో రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని వేల పాత ఇండ్లు కూలగొట్టామని, కొన్నిచోట్ల కోర్టు స్టేలు ఉన్నాయని, అక్కడ కూడా ఇండ్లలో ఎవరూ ఉండకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. ఆరు, ఏడు మండలాల్లో అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదమున్నదని, ప్రత్యేకించి.. నదీంపేట, నందిపేట మండలాలకు ప్రమాదం పొంచి ఉన్నదని తెలిపారు. నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలు, నిజమాబాద్ జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏడు, ఎనిమిది చెరువులు తెగిపోయినట్టు తెలిసిందని, వాటికి ఆనకట్టలు వేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
సెక్రటేరియట్లో 24 గంటల కంట్రోల్ రూమ్
సెక్రటేరియట్, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్అండ్బీ తదితర కేంద్రాల్లో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్లు తెరిచామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఎవరికి ఏ సమస్య ఎదురైనా సంప్రదించాలని సూచించారు. శ్రీకాకుళం నుంచి పనికోసం గృహ నిర్మాణ కార్మికులు నల్లగొండకు వచ్చారని, దురదృష్టవశాత్తు గోడకూలి చనిపోయారని, మృతదేహాలను శ్రీకాకుళం తరలించామని, రూ.3 లక్షల ఎక్స్గ్రేషియా కూడా అందించామని చెప్పారు.