హైదరాబాద్, అక్టోబర్1 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ టీచర్లపై తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. త్వరలో ప్రకటించబోయే పీఆర్సీలో అంగన్వాడీలను కూడా చేర్చాలని నిర్ణయించింది. మధ్యాహ్న భోజనం పెండింగ్ బిల్లులను సైతం విడుదల చేసింది. పలు డిమాండ్లతో సమ్మెకు దిగిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల జాయింట్ యాక్షన్ కమిటీ, సీఐటీయూ, ఏఐటీయూసీ యూనియన్లతో ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ఆదివారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో తక్షణమే సమ్మెను విరమిస్తున్నట్టు చర్చల్లో పాల్గొన్న సంఘాల నేతలు ప్రకటించారు. హరీశ్రావు నివాసంలో జరిగిన చర్చల్లో అంగన్వాడీల డిమాండ్లు, తదితర సమస్యలపై మంత్రులు సానుకూలంగా స్పందించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు త్వరలో ప్రభుత్వం ఇవ్వనున్న పీఆర్సీలో అంగన్వాడీలను చేర్చుతామని, ప్రభుత్వ ఉద్యోగులతోపాటు వారి జీతాలను కూడా పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద పెండింగ్లో ఉన్న బిల్లులను సైతం ప్రభుత్వం విడుదల చేసిందని, ఒకటి రెండు రోజుల్లో వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఇతర డిమాండ్లను సీఎం కేసీఆర్ దృ ష్టికి తీసుకెళ్లి త్వరలో నిర్ణయం తీసుకుంటామని భరో సా ఇచ్చారు. మిగిలిన అంశాలపై నివేదికను సమర్పించాలని స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి భారతి హోలికేరిని మంత్రులు ఆదేశించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం తో రాష్ట్రంలోని 70 వేల మంది అంగన్వాడీలకు లబ్ధి చేకూరుతుందని హరీశ్రావు వివరించారు.
సీఎం కేసీఆర్కు అంగన్వాడీల కృతజ్ఞతలు
సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించడంతో సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా అంగన్వాడీల గురించి పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా అంగన్వాడీల సంక్షేమంపై చిత్తశుద్ధితో ఉన్న సీఎం కేసీఆరేనని కొనియాడారు. డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, సత్యవతిరాథోడ్కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులతో జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయని, సమ్మెను విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. సీఎంపై తమకు విశ్వాసం ఉన్నదని చెప్పారు.