CM KCR | ఆదిలాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): బీసీల్లో వృత్తికులాలకు రూ.1 లక్ష ఆర్థిక సాయం పథకాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మంచిర్యాలలో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. రెండో విడత గొర్రెల పంపిణీకి కూడా శ్రీకారం చుట్టారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ పథకాన్ని సైతం మొదలు పట్టారు. మంచిర్యాల సమీకృత కలెక్టర్ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ లబ్ధిదారులకు చెక్కులు, పట్టాలు తన చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల్లో కులవృత్తులు చేసుకుంటూ ఉపాధి పొందేవారికి ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకున్నట్టు చెప్పారు. నాయీబ్రాహ్మణులకు మోడ్రన్ సెలూన్ కోసం, దోభీఘాట్, మోడ్రన్ ఇస్త్రీ షాపుల కోసం రూ.లక్ష సాయం చేస్తున్నట్టు తెలిపారు. బీసీ కులాల్లో చేతివృత్తులను ఆదుకునేందుకు ఈ కార్యక్రమం దోహద పడుతుందని అన్నారు.
రెండో విడతలో రూ.6 వేల కోట్లతో గొర్రెల పంపిణీ
తెలంగాణ ఏర్పడిన తర్వాత పశుసంవర్ధకశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తే రోజూ 17 వేల గొర్రెలు ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి అవుతున్నట్టు వెల్లడించారని సీఎం కేసీఆర్ చెప్పారు. యాదవులు ఎందరు ఉన్నారని అడిగితే 30 లక్షల మంది ఉన్నట్టు చెప్పారని గుర్తు చేశారు. వెంటనే గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. రెండో విడతలో 3.80 లక్షల మంది లబ్ధిదారులకు రూ.6 వేల కోట్లతో గొర్రెలను అందజేస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర అటవీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్ పాల్గొన్నారు.
మా బతుకులకు తోవ చూపిండు
మేము జీవాలను నమ్ముకొని బతుకుతున్నం. మా తాత, తండ్రుల నుంచి దీనిపైనే ఆధారపడ్డం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ కులవృత్తులపై ఆధారపడ్డ వారికి ఉపాధి కల్పిస్తుండు. గొల్ల, కుర్మలకు జీవాలను అందజేసి మా బతుకుల్లో వెలుగులు నింపుతుండు. రెండో విడుతలో భాగంగా నేను సీఎం చేతుల మీదుగా గొర్రెలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మేం ఏరుకున్న గొర్లే ఇచ్చిండ్రు. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే దేశంలోని యాదవులందరికీ జీవాలు అందుతాయి. యాదవులే కాదు.. కులవృత్తులపై ఆధారపడ్డ వారందరికీ కేసీఆర్ తోవ చూపుతున్నడు.
–బోలవేని ఓదెలు, పాత బెల్లంపల్లి, బెల్లంపల్లి, గొర్రెల లబ్ధిదారు
కులవృత్తులకు సీఎం అండ
నాకు ఊహ తెలిసిన నాటి నుంచి మా కులవృత్తి కుమ్మరి పని చేసుకుంటూనే కూలిపని చేసుకుంటున్న. నా ముగ్గురు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివిస్తున్నా. మేము తయారు చేసిన కుండలను తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోని సిరొంచ, అయిరి, ఆళ్లపల్లి, తిమ్మలగట్టు, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి హోల్సేల్గా తీసుకెళ్తుంటారు. కుల వృత్తులవారికి సీఎం కేసీఆర్ లక్ష సాయం అందించడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అందుకోవడం నాకు సంతోషంగా ఉంది.
–కుందారపు మురళి, వెలమపల్లి,కులవృత్తి లబ్ధిదారు
ధనికులను చేస్తున్నడు
కుల వృత్తులను వదులుకుంటున్న సమయంలో యాదవులకు గొర్రెల పంపిణీ చేపట్టి సీఎం కేసీఆర్ మమ్మల్ని ధనవంతులను చేస్తున్నడు. మా ఇంట్లో మేము నలుగురం ఉండగా, గొర్రెలే మాకు జీవనాధారం. గొర్రెల పెంపకం తప్ప ఏం తెలియని మాకు సీఎం కేసీఆర్ గొర్రెలను అందజేసి మాకు ఊపాధిని చూపుతున్నరు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గొర్రెలను అందుకోవడం ఆనందంగా ఉంది.
–ఆవుల వెంకటేశ్, కాసిపేట,తాండూర్, గొర్రెల లబ్ధిదారు